విద్య, ఉపాధి కోసం వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులు మాతృదేశంలో ఎన్నికల్లో పాలుపంచుకోవాలని చూస్తున్నారు.ఈ ఆలోచనతోనే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్నారు ఓ ఎన్ఆర్ఐ మహిళ, అది కూడా ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా.
దర్భంగా ప్రాంతానికి చెందిన జేడీయూ ఎమ్మెల్సీ వినోద్ చౌదరి కుమార్తె పుష్పం ప్రియా చౌదరి తాను బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్ధిగా పోటీ చేస్తున్నట్లు మహిళా దినోత్సవం నాడు తెలిపారు.ఈ ఎన్నికల్లో తాను గెలిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిని అవుతానని, 2025 నాటికి బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతానని ప్రియ ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.
బీహార్లో శాంతి అవసరం అవసరం ఎంతైనా ఉందని, రాష్ట్రానికి కొత్త రెక్కలు కావాలని, మార్పు అవసరమన్నారు.చెత్త రాజకీయాలను తిరస్కరించండి, ఫ్లూరల్స్లో చేరండి… 2020 నాటికి బీహార్ను అభివృద్ధి పథంలో నడిచేలా చేద్దాం అని పుష్పం తన ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
యూకేలోని సుస్సెక్స్ యూనివర్సిటీలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ నుంచి డెవలప్మెంట్ స్టడీస్లో ప్రియ ఎంఏ పూర్తి చేశారు.లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి మాస్టర్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పట్టా అందుకున్నారు.కాగా ప్రస్తుతం బీహార్లో బీజేపీ- జేడీయూ -ఎల్జేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది.దీనికి నితీశ్ కుమార్ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.మరోవైపు ప్రియ చౌదరి తండ్రి వినోద్ చౌదరి జేడీయూ ఎమ్మెల్సీగా ఉన్నారు.ఆమె ప్రకటనతో బీహార్తో పాటు ఎన్ఆర్ఐ వర్గాల్లోనూ పెద్ద చర్చ జరుగుతోంది.