తెలుగువారి పండుగలలో ఎంతో ముఖ్యమైన పండుగలలో ఉగాది ఒకటి.రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం.ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి.చైత్ర శుద్ధ పాడ్యమి రోజు కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో తెలుగు ప్రజలు ఈ రోజున కొత్త ఏడాదిగా ఉగాది పండుగను జరుపుకుంటారు.ఈ ఉగాది పండుగ ఈ రోజు తెలుగు ప్రజలు వివిధ రకాల పిండివంటలు తయారు చేసుకొని, ప్రత్యేక పూజలు చేసి పంచాంగ శ్రవణం చేస్తారు.
నూతన సంవత్సరంలో రాశిఫలాలు గ్రహస్థితులు ఏవిధంగా ఉన్నాయో పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుంటారు.అసలు ఉగాది పండుగను చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చరిత్ర చెబుతోంది.
ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున బ్రహ్మదేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడని భక్తులు విశ్వసిస్తారు.అందుకోసమే ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అదేవిధంగా సోమకుడు అనే రాక్షసుడు బ్రహ్మ దేవుడి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కుంటాడు.సోమకుని సంహరించి, వేదాలను రక్షించడం కోసం విష్ణుమూర్తి మత్స్య అవతారం ఎత్తి సోమకుని చంపి వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించాడని ఆ రోజు నుంచి ఈ చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగగా జరుపుకుంటారు.
ప్రస్తుతం శార్వారి నామ సంవత్సరం కాగ ఉగాది రోజు నుంచి ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.ఈ ఏడాది ఏప్రిల్ 13న దేశంలో పలు రాష్ట్రాల్లో ఈ పండుగను జరుపుకుంటారు.ఏప్రిల్ 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఏప్రిల్ 13 ఉదయం 10 :16 ఉగాది తిథి పూర్తవుతుంది.పండుగ జరుపుకోవడానికి ఈ సమయం ఎంతో శుభ సమయం.
ఇకపోతే ఉగాది పండుగను వివిధ రాష్ట్రాలలోని ప్రజలు ఒక్కో పేరుతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు.మహారాష్ట్రలో ఉగాదిని గుడిపడ్వాగా జరుపుకుంటారు.
తమిళులు పుత్తాండు అని, మలయాళీలు విషు అని, సిక్కులు వైశాఖీ అనే పేర్లతో పిలుస్తారు.