కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్డౌన్తో పరాయి దేశంలో అష్టకష్టాలు పడి స్వదేశానికి చేరిన ప్రవాస భారతీయులను పెయిడ్ క్వారంటైన్ పేరుతో జేబులను గుళ్ల చేస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు వస్తున్నాయి.ప్రధానంగా కేరళలో ఈ వివాదం తారాస్థాయికి చేరింది.
విదేశాలు , ఇతర రాష్ట్రాల నుంచి స్వస్థలాలకు వెళ్తున్న వారి కారణంగా కరోనా మరింతగా వ్యాప్తి చెందుతోంది.గత కొన్ని రోజులుగా దేశంలో వెలుగు చూస్తున్న కేసులు పరిస్ధితి తీవ్రతను తెలియజేస్తోంది.
ఈ నేపథ్యంలో విదేశాల నుంచి కేరళకు వచ్చే వారు వారం పాటు సంస్థాగత నిర్బంధంలోనే, మరో వారం పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని అందుకయ్యే ఖర్చులను కూడా ఎన్ఆర్ఐలే భరించాలని సీఎం పినరయి విజయన్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదమైంది.
దీనిపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి.
ముఖ్యమంత్రి నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్షం యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.సంస్థాగత నిర్బంధానికి రుసుము వసూలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం క్రూరమైనదని ప్రతిపక్షనేత రమేశ్ చెన్నితాలా అన్నారు.
ఎన్ఆర్ఐలను సర్కార్ పెయిడ్ గెస్టులుగా చూస్తూ అవమానిస్తోందని రమేశ్ మండిపడ్డారు.
ప్రతిరోజూ సగటున ముగ్గురు మలయాళీలు విదేశాలలో మరణిస్తున్నారని.వారి కోసం విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన విమర్శించారు.ఎంపీలాడ్ ఫండ్ నిబంధనలను కేంద్రం సవరించిందని, దీనితో పాటు ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రజలు విరాళాలు ఇస్తున్నారని రమేశ్ గుర్తుచేశారు.సీఎంఆర్ఎఫ్లో రూ.2,000 కోట్ల వరకు నిధులు ఉన్నాయని దీనిని ఎన్ఆర్ఐల సంస్థాగత నిర్బంధం కోసం ఖర్చు చేయవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.ఒక్క కేరళలోనే కాకుండా దేశంలోని వివిధ రాష్టాల్లోనూ పెయిడ్ క్వారంటైన్ పేరిట ఎన్ఆర్ఐలపై బిల్లుల భారం మోపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.