కరోనా కారణంగా ఎంతో మంది ఎన్నారైలు స్వదేశంలో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.దాంతో ఎంతో మంది విదేశాలలో తమ ఉద్యోగ, వ్యాపార, విద్య విషయంలో ఆందోళన చెందుతున్నారు.
పలు దేశాలు భారత్ నుంచీ వచ్చే ప్రయాణీకులపై ఆంక్షలు సడలిస్తున్నా యూఏఈ ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తోంది.దాంతో కేవలం భారత ఎన్నారైలు మాత్రమే కాదు, వారికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చిన కంపెనీలు కూడా ఆందోళన చెందుతున్నాయి.
ముఖ్యంగా యూఏఈ లోని హాస్పటల్స్ ఈ విషయంలో ఇబ్బందులు ఎదుర్కుంటున్నాయట ఎందుకంటే.
యూఏఈ లోని ఆసుపత్రులలో అత్యధిక శాతం భారత్ కు చెందిన వైద్య వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో వీరి అవసరం ఎంతో ఉంది.ఈ క్రమంలో దుబాయ్ లోని ప్రఖ్యాత ఆస్టర్ హాస్పటల్స్ అండ్ క్లినిక్ తమ హాస్పటల్ నందు పనిచేస్తూ భారత్ కు వివిధ కారణాల ద్వారా వెళ్ళిన వైద్య నిపుణులను మళ్ళీ దుబాయ్ రప్పించేందుకు దుబాయ్ ప్రభుత్వం పై ఒత్తిడి చేసింది.
తమ హాస్పటల్స్ నందు భారత వైద్య నిపుణుల అవసరం ఎంతైనా ఉందని.
ప్రస్తుత పరిస్థితులలో వారిని దుబాయ్ కు రప్పించాలని విజ్ఞప్తులు చేసింది.తమ హాస్పటల్స్ కు చెందిన దాదాపు 250 మంది భారత్ లో కరోనా కారణంగా ఉండిపోయారని ప్రత్యేక అనుమతులతో వారిని దుబాయ్ రప్పించాలని కోరింది.దాంతో దుబాయ్ హెల్త్ అధారిటీ అనుమతులు ఇవ్వడంతో రెండు ప్రత్యేక విమానాల ద్వారా కేరళ, కర్నాటక, హైదరాబాద్, పాండిచ్చేరి , బెంగుళూరు, మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచీ సుమారు 73 మంది నిపుణులను దుబాయ్ కు తరలించింది.
మొదటి విడతగా కొందరిని దుబాయ్ కు తీసుకువచ్చామని, త్వరలో మిగిలిన వారిని కూడా దుబాయ్ రప్పిస్తామని ఆస్టర్ హాస్పటల్స్ అండ్ క్లినిక్ ప్రతినిధులు తెలిపారు.భారత వైద్య సిబ్బంది దుబాయ్ చేరడానికి సహకరించిన ప్రభుత్వానికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపింది ఆస్టర్ హాస్పటల్స్ అండ్ క్లినిక్.