యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరిగిన డ్రోన్ దాడుల్లో మరణించిన ఇద్దరు భారతీయుల భౌతికకాయాలు స్వదేశానికి చేరుకున్నాయి.శుక్రవారం పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయానికి మృతదేహాలతో కూడిన విమానం ల్యాండ్ అయ్యింది.
నాటి ఘటనలో మరణించిన ఇద్దరు భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అబుదాబీలోని భారత రాయబార కార్యాలయం తీవ్రంగా శ్రమించింది.భారత్, పంజాబ్ ప్రభుత్వాల సాయంతో అన్ని రకాల చట్టపరమైన లాంఛనాలను పూర్తి చేసి బాధితుల మృతదేహాలను ఇండియాకు పంపినట్లు యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.
కాగా.యూఏఈ రాజధాని అబుదాబిలోని అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా జనవరి 17న డ్రోన్ దాడి జరిగింది.
ఈ దాడిలో మూడు ఆయిల్ ట్యాంకర్లు పేలడంతో భారీ ఎత్తున మంటలు సంభవించాయి.ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.
ఆరుగురు స్వల్పంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.మృతుల్లో ఇద్దరు భారతీయులు .ఒక పాక్ జాతీయుడు వున్నాడు.అబుదాబి విమానాశ్రయంపై డ్రోన్ దాడులు తమ పనేనంటూ హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు.
యెమెన్లో ఇరాన్ అనుకూల హౌతీ తిరుగుబాటుదారులతో 2015 నుంచి సౌదీ నేతృత్వంలో యూఏఈ యుద్ధం చేస్తోంది.ఈ నేపథ్యంలో సౌదీతో పాటు యూఏఈని కూడా హౌతీ తిరుగుబాటుదారులు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు.
మరోవైపు డ్రోన్ దాడులపై సౌదీ అరేబియా ఆగ్రహం వ్యక్తం చేసింది.దీనికి ప్రతిగా దాడులు జరిగిన కొద్ది గంటల్లోనే సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు.హౌతీ తిరుబాటుదారుల ఆధీనంలోని యెమెన్ రాజధాని సనాపై మంగళవారం వైమానిక దాడులతో విరుచుకుపడ్డాయి.ఈ దాడుల్లో దాదాపు 11 మంది మృతి చెందినట్లు సమాచారం.దీనితో పాటు సౌదీ అరేబియా వైపు ఉగ్రవాదులు ప్రయోగించిన ఎనిమిది డ్రోన్లను అడ్డుకున్నట్లు సంకీర్ణ దళాలు ప్రకటించాయి.