ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో, దీనిని ఎలా అడ్డుకోవాలో తెలియక ప్రభుత్వాలు తలలు పట్టుకుంటున్నాయి.ఆర్ధికంగా బలంగా ఉన్న దేశాలే ఏం చేయలేకపోతున్న తరుణంలో నిరుపేద దేశాలు వణికిపోతున్నాయి.
అయితే కొందరు మనసున్న మా రాజులు మాత్రం తమ దేశ ప్రభుత్వాలకు సహకరిస్తున్నారు.తాజాగా కరోనా వైరస్ రోగుల చికిత్స కోసం ప్రత్యేకంగా ఓ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి భారత సంతతికి చెందిన పారిశ్రామికవేత్త డాక్టర్ షంషీర్ వయలిల్ సాయం చేయడానికి ముందుకు వచ్చారు.
ప్రస్తుతం భారతదేశం కరోనాను ఎదుర్కోవడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించడంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సరిహద్దులను మూసేసి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.
డాక్టర్ వలాలిల్కు చెందిన వీపీఎస్ హెల్త్కేర్ ఢిల్లీలో కరోనా రోగుల చికిత్స కోసం 500 పడకల ఆసుపత్రిని నిర్మించింది.మేడియర్ హాస్పిటల్స్ బ్రాండ్ పేరుతో ఈ సంస్థకు ఢిల్లీలో మూడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి.
ఆసుపత్రిని ఏర్పాటు చేయడంతో పాటు కరోనా మరింత వ్యాప్తి చెందకుండా బాధిత రోగుల సంరక్షణకు ప్రత్యేక వైద్యులు, నర్సులు ఇతర వైద్య సిబ్బందితో కూడిన ప్రత్యేక టాస్క్ఫోర్స్ను వయలిల్ ఏర్పాటు చేశారు.
వీపీఎస్ హెల్త్కేర్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్న డాక్టర్ వయలిల్ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో ‘‘ భారత ప్రభుత్వ ప్రయత్నాలకు తోడ్పడటానికి కోవిడ్ 19 చికిత్స కోసం మనేసర్లో ఉన్న తమ మేడియర్ హాస్పిటల్ను ప్రత్యేక ఐసోలేషన్ కింద అందిస్తామని ఆయన తెలిపారు.ఇదే సమయంలో వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో పాటు రోగులకు చికిత్స చేస్తున్న అధికారులు, వైద్య సిబ్బంది నిస్వార్థ సేవను డాక్టర్ షంషీర్ అభినందించారు.
ఆసుపత్రి నిర్వహణకు సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఢిల్లీలోని మేడియర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ నిహాజ్ జీ మహ్మద్ అన్నారు.
తమ ఆసుపత్రిలో సౌకర్యాలు, సేవల గురించి ఇప్పటికే అధికారులకు తెలియజేశామని ఆయన చెప్పారు.కరోనా రోగులకు, అనుమానితులకు సేవలు అందించేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వ అనుమతి కోసం ఎదురుచూస్తున్నామని మహ్మద్ స్పష్టం చేశారు.
కాగా డాక్టర్ షంషీర్ వయలిల్ అబుదాబీలో ఉంటున్నారు.ఆయన స్వస్థలం కేరళ.
ఇప్పుడే కాదు గతంలోనూ ఆయన మాతృదేశానికి కోట్లాది రూపాయల విరాళాలు ఇచ్చారు.కేరళ వరదల సమయంలో సుమారు 26 మిలియన్ దిర్హమ్లు (భారత కరెన్సీలో రూ.50 కోట్లు) విరాళం ఇచ్చి ప్రజలను ఆదుకున్నారు.షంషీర్ సారధ్యంలో అబుదాబీ కేంద్రంగా పనిచేస్తున్న వీపీఎస్ హెల్త్కేర్ సంస్థకు మధ్య ఆసియా, భారత్, యూరప్లలో 22 ఆసుపత్రులు, 125 మెడికల్ సెంటర్లు ఉన్నాయి.