కరోనా వైరస్ మనిషికి అసలు తన చుట్టూ ఏం జరుగుతోందో, తాను ఎవరో తెలిపింది.సమాజంలో తన స్థానం ఏంటో, ఎలా బ్రతకాలో పరిచయం చేసింది.
మనుషుల ప్రాణాలు తీయడంతో పాటు మాయమవుతున్న మానవత్వాన్ని బయటికి తీసింది.లాక్డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి పేదలకు సాయం చేస్తున్నారు .ఒకరితో ఒకరికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ.మానవత్వం వీరి మధ్య బంధాన్ని వేస్తోంది.
తాజాగా అలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
కరోనా కారణంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో చాలా మంది వివిధ దేశాల్లో చిక్కుకుపోయారు.
ఇక మరణాలు సంభవించిన వారి కుటుంబాల బాధ వర్ణనాతీతం.ఆంక్షల కారణంగా చివరి చూపు కూడా చూసుకునే అవకాశం లేకుండా పోతోంది.
ఈ నేపథ్యంలో విదేశాల్లో మరణించిన కన్నబిడ్డను స్వదేశం తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలనుకున్న ఓ ఎన్ఆర్ఐ కుటుంబానికి అజ్ఞాత వ్యక్తి సాయం చేశాడు.
వివరాల్లోకి వెళితే.
కేరళలోని పాలక్కడ్కు చెందిన కృష్ణదాస్ కుటుంబం ఏడేళ్ల క్రితం ఉపాధి కోసం యూఏఈలోని షార్జాకు వలస వెళ్లింది.ఈ క్రమంలో నెల రోజుల క్రితం కృష్ణదాస్ 4 ఏళ్ల కుమారుడు వైష్ణవ్కు ల్యూకేమియాగా తేలింది.
అప్పటికే చేయి దాటిపోవడంతో 15 రోజుల్లోనే చిన్నారి మరణించారు.ఇదే షాకింగ్ న్యూస్ అయితే అంత్యక్రియలు సాంప్రదాయం ప్రకారం భారతదేశంలో నిర్వహించాలని భావించిన కృష్ణదాస్ దంపతులకు నిరాశే ఎదురైంది.
ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉండటంతో అతనికి భారత్కు వెళ్లడం సాధ్యంకాదు.చివరికి కాన్సులేట్ అధికారులను సంప్రదించినప్పటికీ ఫలితం శూన్యం.ఇదే సమయంలో విదేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కేంద్ర ప్రభుత్వం ‘‘వందే భారత్ మిషన్’’ పేరుతో ప్రత్యేక విమానాలను నడుపుతున్న విషయం తెలియడంతో ఆ దిశగా ప్రయత్నించాడు.కానీ అవి చాలా పరిమిత సంఖ్యలో ఉండటంతో కృష్ణదాస్కు అవకాశం లభించలేదు.
దీంతో దిక్కుతోచని పరిస్ధితిలో కొడుకు మృతదేహాన్ని అల్ ఐన్లోని తవాం హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు.
వీరి ఆవేదన యూఏఈలోని పత్రికల్లో రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఈ విషయం తెలుసుకున్న అస్సాంకు చెందిన డాక్టర్, సామాజిక కార్యకర్త అయిన గోగోయ్.కృష్ణదాస్ కుటుంబానికి సాయం చేశాడు.
వెంటనే యూఏఈలోని మిత్రుల ద్వారా ఈ కథనం రాసిన విలేకరిని సంప్రదించి.కృష్ణదాస్ వివరాలు తెలుసుకున్నాడు.
మే 13న విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ను కలిసి, సమస్యను వివరించాడు.ఆయన వెంటనే స్పందించి.మరుసటి రోజే కృష్ణదాస్ కుటుంబాన్ని ఇండియాకు రప్పించేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేశారు.
దీనిపై డాక్టర్ గోగోయ్ స్పందిస్తూ… కృష్ణదాస్ కుటుంబం ఎదుర్కొంటున్న ఇబ్బంది తనను తీవ్రంగా కలచివేసిందని.వారికి తన వంతు సాయం చేయాలనుకున్నానని చెప్పాడు.
ముఖ పరిచయం కూడా లేని గోగోయ్ తనకు చేసిన సాయం పట్ల కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలిపారు.ఆయన లేకపోయుంటే.
తాము భారత్కు తిరిగి వచ్చే వారం కాదని, గోగోయ్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని అన్నారు.