ఇటీవల అమెరికా బలగాలు ఇరాన్ మిలిటరీ కమాండర్ సులేమాని ని రాకెట్ దాడులతో హతమార్చిన సంగతి తెలిసిందే.అయితే సులేమాని మృతి పై ఇరాన్ రగిలిపోతుంది.
దీనితో అమెరికా పై ప్రతీకారం తీర్చుకుంటామని,ఏకంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తలకే బహుమతి ప్రకటన చేసి,ఇది దేశం పూనిన ప్రతిన అంటూ ఇరాన్ కఠిన నిర్ణయం తీసుకుంది.అయితే ఆ ప్రతిన పూనినట్లుగానే అప్పుడే అమెరికా పై ఇరాన్ తన ప్రతీకారేచ్ఛను మొదలు పెట్టింది.
ఇందులో భాగంగా లో ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణులు దాడులకు పాల్పడింది.ఈ దాడుల్లో 80 మంది అమెరికా సైనికులు మృతి చెందగా, భారీ గా ఆస్తినష్టం కూడా జరిగినట్లు తెలుస్తుంది.
ఇరాన్ దాడుల నేపథ్యంలో యూఎస్ మిలిటరీ హెలికాఫ్టర్లు,ఇతర సామాగ్రి పూర్తిగా ధ్వంసం అయినట్లు మీడియా తెలిపింది.
అమెరికా దళాలు ఉన్న ఇరాక్ ఎయిర్బేస్ లక్ష్యంగా ఇరాన్ దాడులకు పాల్పడింది.ఇరాక్లోని అల్ అసద్, ఇర్బిల్ ఎయిర్బేస్లపై 15 క్షిపణులతో దాడి చేసింది.అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకోవాలని ఇరాన్ హెచ్చరించింది.
తాజా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమీక్షిస్తున్నారని వైట్ హౌస్ అధికారులు తెలిపారు.మరోపక్క తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన అనంతరం అమెరికా స్పందిస్తూ….
ఇరాన్, ఇరాక్, గల్ఫ్ ఆఫ్ ఒమెన్ గగనతలం మీదుగా యూఎస్ విమానయాన సంస్థల విమానాలేవీ ప్రయాణించరాదని తాజాగా ఆదేశాలు జారీ చేసింది.ఈ మేరకు యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇరాన్, సౌదీ అరేబియా సముద్ర జలాలపైనా ప్రయాణాలు సాగించవద్దని ఖచ్చితంగా వెల్లడించింది.
ఈ దాడులను సీరియస్ గా తీసుకున్న అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ తగిన ఫలితాన్ని అనుభవిస్తుందని హెచ్చరించారు.
మొన్నటివరకు కేవలం మాటల వరకే పరిమితమైన ఇరు దేశాల మధ్య యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధంగా మారినట్లు అయ్యింది.సులేమానీ హత్య తర్వాత పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు ప్రతీకార దాడులకు ఉసిగొలుపుతున్నాయి.
అమెరికా అంతు చూస్తామని ప్రకటించిన ఇరాన్, సులేమానీ అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటలకే అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలు పెట్టింది.దీనిలో భాగంగానే ఇరాక్ లోని అమెరికా బేస్ క్యాంప్ లపై క్షిపణి దాడులకు పాల్పడడం తో 80 మంది అమెరికా సైనికులు మృతి చెందినట్లు తెలుస్తుంది.
ఈ ఘటన కు సంబందించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.