చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మొబైల్ ఫోన్ వాడేస్తున్నారు.మాటలు రాని పసిపిల్లలు సైతం ఫోన్ నొక్కడానికి అలవాటు పడిపోయారు.
పిల్లలు ఫోన్ నొక్కుతుంటే వాళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు వాళ్ళని చూసి తల్లి దండ్రులు తెగ మురిసిపోతూ ఉంటారు.చిన్న పిల్లలకు ఫోన్ అలవాటు చేయడం అంత మంచిది కాదు.
ఎందుకంటే చిన్నవయసులోనే ఫోన్ కు అలవాటు పడిపోతే పెద్దయ్యాక కూడా అదే అలవాటుగా మారిపోతుంది.అలాగే చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్లు అలవాటు చేసే ముందు ఒక చిన్నపిల్లాడు చేసిన పని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి.
ఈ ఘటన గురించి విన్నాక అయినా మీరు మీ పిల్లలకు ఫోన్ ఇవ్వడం మానేయండి.లేదంటే వాళ్ళని ఒక కంట కనిపెట్టుకుని ఉండండి.ఇంకా మాటలు కూడా సరిగా రాని పిల్లలకు ఫోన్ ఇస్తే వాళ్ళకి ఫోన్లో ఏమి నొక్కుతారో కూడా తెలియదు.అలాంటి ఒక బుడతడు వాళ్ళ అమ్మ ఆడుకోమని ఫోన్ ఇస్తే తాను ఏమి చేస్తున్నాడో తెలియక ఆన్ లైన్ షాపింగ్ ద్వారా రూ.1.50 లక్షల విలువైన వస్తువులను కొనుగోలు చేసి తల్లి తండ్రులకు పెద్ద షాక్ ఇచ్చాడు.ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది.అసలు వివరాల్లోకి.వెళితే అమెరికాలోని న్యూజెర్సీలో నివసిస్తున్న ప్రవాస భారతీయులు అయిన ప్రమోద్ కుమార్, మధుమతి కుమార్ దంపతులకు ముగ్గురు పిల్లలు.
వాళ్లలో రెండేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.అయితే న్యూజెర్సీలో ఉంటున్న ప్రమోద్ కుమార్ కుటుంబం కొద్ది రోజుల క్రితమే ఇల్లు మారారు.ఈ క్రమంలోనే కొత్త ఇంటిలోకి అవసరమైన గృహోపకారణాలను కొనాలనే ఉద్దేశంతో ప్రమోద్ కుమార్, మధుమతులు ఆన్లైన్ షాపింగ్ యాప్ ద్వారా కొన్ని వస్తువులను వెతికి వాటిని కార్ట్ లోకి యాడ్ చేసి తరువాత బుక్ చేద్దాంలే అనుకుని ఫోన్ పక్కన పడేసారట.
అయితే మరుసటి రోజు వాళ్ళు ఆన్లైన్ షాపింగ్ ద్వారా ఏవయితే వస్తువులు కొనాలని కార్ట్ లో యాడ్ చేసారో ఆ వస్తువులు ఒక్కోక్కటిగా ఇంటికి చేరుకోవడం చూసి ఆశ్చర్యపోయింది మధుమతి.
ఒకవేళ తన భర్త అయిన ప్రమోద్ కుమార్ తనకి తెలియకుండా ఆర్డర్ చేసి ఉంటాడేమోనని భర్తని అడగడంతో ప్రమోద్ కూడా తానేమీ ఆర్డర్ చేయలేదని చెప్పడంతో తన ఇద్దరు పిల్లలను అడిగింది.వారు కూడా ఏమి ఆర్డర్ చేయలేదని చెప్పడంతో ఇక మిగిలింది తమ రెండేళ్ల కుమారుడు ఆయాన్ష్ కుమార్ మాత్రమే.ఇక డౌట్ లేదు.
వాడే ఈ ఘనకార్యం చేసి ఉంటాడని గ్రహించారు.ఇంటికి చేరుకున్న వస్తువులను తిరిగి వెనక్కు ఇచ్చేందుకు గాను సదరు సంస్థకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పగా వాళ్ళు సమస్యను అర్ధం చేసుకుని పంపిన వస్తువులన్నీ తీసుకుని పూర్తి డబ్బు వాపసు చేస్తామని తెలిపారట.
అయితే తమ రెండేళ్ల సుపుత్రుడు తెలిసీ తెలియక చేసిన ఈ చిలిపి పనికి గుర్తుగా కొన్ని వస్తువులను తాము ఉంచుకుని మిగతా వస్తువులను తిరిగి ఇచ్చేస్తామని ప్రమోద్ కుమార్ దంపతులు చెప్పుకొచ్చారు.ఇకపై ఫోన్ కు లాక్ పెడతామని ప్రమోద్ కుమార్ చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం ఈ బుడతడు చేసిన పని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.