ఆడపిల్ల పుడితే లక్ష్మి దేవి అని చెప్పి కొందరు అంటూ ఉంటారు.కొందరు మాత్రం ఆడపిల్ల వద్దు,మగ పిల్లాడే ముద్దు అన్నట్లు వారు చేస్తున్న దారుణాలు అన్ని ఇన్ని కావు.
తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి ఒక దారుణ ఘటన వెలుగుచూసింది.జూబ్లి బస్ స్టేషన్ వద్ద నిర్మానుష్య ప్రాంతంలో ఓ పసిబిడ్డను పూడ్చిపెట్టేందుకు ఇద్దరు ప్రయత్నం చేయగా పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకొని వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
నిర్మానుష ప్రాంతంలో అనుమానాస్పదంగా కనిపించిన వారిని చూసిన ఒక ఆటో డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించడం తో ఆ ప్రాంతానికి చేరుకొని వారిని ప్రశ్నించారు.అయితే రెండు రోజుల క్రితం ఒక ఆపరేషన్ విఫలం కావడం తో ఆ చిన్నారి మృతి చెందింది అని,శవం అని చెబితే ఎవరూ సహాయం చేయరని అందుకే ఈ నిర్మానుష ప్రాంతంలో పూడ్చిపెట్టడానికి వచ్చినట్లు ఆ ఇరువురిలో ఒకడైన పెద్దాయన తెలిపారు.
అయితే పోలీసులు ఎన్నిసార్లు ప్రశ్నించినా కూడా బిడ్డ చనిపోయింది అంటూ తెలిపి ఆ పెద్దమనిషి తప్పించుకొనే ప్రయత్నం చేశాడు.అయితే అనంతరం ఆ పసిబిడ్డ కదులుతుండడం తో ఆ పసిబిడ్డ బతికి ఉండగానే వారు పాతిపెట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు నిర్ధారించారు.
అయితే ఎందుకు అలా చేస్తున్నారని పోలీస్ కానిస్టేబుల్ ప్రశ్నించడం తో తాము కరీంనగర్కు చెందిన వారిమని, ఆ బిడ్డ తమ మనమరాలని చెప్పిన ఆ వ్యక్తి తిరిగి అదే కధ చెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే అనుమానం వచ్చిన పోలీసులు ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని ఆ పసి బిడ్డను మాత్రం గాంధీ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది.చివరికి ఆడపిల్ల పుట్టింది అన్న కారణంగా సొంత తాత ఆ పసిబిడ్డ పై ఇలాంటి దారుణానికి పాల్పడడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.వేలు పట్టి నడక నేర్పించాల్సిన తాత అయి ఉండి ఇలా ఆ చిన్నారిని బతికి ఉండగానే పూడ్చిపెట్టే ప్రయత్నం చేశాడు.