సాధారణంగా ఎన్నికలలో నిలబడిన అభ్యర్థులు ఓటర్లను సంపాదించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు.ఏదో ఒక ఆశ చూపి తమకు ఓటు వేయాలని బతిమిలాడుతారు.
నామినేషన్లు వేసిన అనంతరం తమకు ఓటు గుర్తు రాగానే వెంటనే ఆ గుర్తు పట్టుకుని ప్రతి ఇంటికి తిరిగి తమ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థిస్తారు.కానీ ఏపీ పంచాయతీ ఎన్నికల పోటీకి బరిలోకి దిగిన ఇద్దరు అభ్యర్థులు మాత్రం తమకు ఓటు వేయవద్దని ఇంటింటికి తిరిగి విజ్ఞప్తి చేస్తున్నారు.
అయితే ఈ వింత ప్రచారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హాట్ టాపిక్ అయింది.ఎవరైనా తమకు ఓట్లు వేయాలని అభ్యర్థిస్తారు కానీ వీరేంటి ఇలా తమకు ఓట్లు వేయొద్దు అని ఇంటికి పోయి మరీ అడుక్కుంటున్నారు? అని చాలామంది నోరెళ్లబెడుతారు.ఇంతకీ ఈ వింత ప్రచారం ఎక్కడ జరుగుతుంది అంటే.తూర్పు గోదావరి జిల్లా మామిడి కుదురు మండలం మొగలికుదురు గ్రామంలో.
మరి ఇలా ప్రచారం చేయడం వెనక గల కారణం ఏంటో తెలుసుకుంటే.
ఏపీ పంచాయతీ నాలుగో విడతలో మొగలికుదురు గ్రామంలో ఎన్నికలు జరగనున్నాయి.ఈ గ్రామంలో సర్పంచి పదవి కోసం నాగలక్ష్మి, వెంకటరమణ అరుణకుమారి అనే ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.వీళ్ళు నామినేషన్లు కూడా వేశారు.
ఐతే నామినేషన్లు వేసే గడువుతో పాటు నామినేషన్లను ఉపసంహరించుకునే గడువు కూడా ముగిసిన తర్వాత గ్రామ ప్రజలంతా సమావేశమై పోటీల్లో ఒక్కరే ఉండాలని తీర్మానించి.కడి అరుణ కుమారి పేరును ఖరారు చేశారు.
దీంతో నాగలక్ష్మి, వెంకటరమణ గ్రామ ప్రజలు నిర్ణయించినట్టు పోటీ నుంచి తప్పుకోవాలి అనుకున్నారు.కానీ నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు ముగియడంతో, ఎన్నికల అధికారులు గుర్తులు కూడా ప్రకటించడంతో ఇక చేసేదేమీలేక నాగలక్ష్మి, వెంకటరమణ ప్రతి ఇంటికి తిరిగి తమ గుర్తులు చూపించి ఆ గుర్తులకు దయచేసి ఓటు వేయకండి అని విజ్ఞప్తి చేస్తున్నారు.
కడి అరుణ కుమారినే గెలిపించాలని కోరుతున్నారు.