అమెరికాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది.రెండు విమానాలు గాల్లో ఢీకొని.
అనంతరం సరస్సులో పడిపోయాయి.ఈ దుర్ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఇదాహో రాష్ట్రంలోని కోయర్ డీ అలెన్ సరస్సు మీదుగా వెళ్తుండగా రెండు విమానాలు గాల్లో ఢీకొని, సరస్సులో పడి మునిగిపోయాయి.ఈ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్లుగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని ఇప్పటి వరకు రెండు మృతదేహాలను వెలికితీశాయి.మరో ఆరుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.మృతుల్లో చిన్నారులు, పెద్దవాళ్లు ఉన్నట్లుగా తెలుస్తోంది.కాగా రెండు విమానాలు ఢీ కొట్టుకోవడం వెనుక వున్న కారణం ఇంకా తెలియాల్సి వుంది.
మరోవైపు సరస్సులో మునిగిపోయిన విమానాల శకలాలను సోనార్ సాయంతో గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.వీటిని వెలికి తీయడానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం వుంది.
శకలాలు బయటకు వస్తే కానీ ప్రమాదానికి దారి తీసిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశముంది.కాగా ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.