క్యాన్సర్… ఈ మూడక్షరాల పదం ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది.మనిషి జీవన గమనంలో ఎన్నో భయంకర వ్యాధులను ఎదుర్కొని వాటిని సమూలంగా నిర్మూలించగలిగాడు.
కానీ వైద్య శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం ఇంతగా అభివృద్ది చెందుతున్నా క్యాన్సర్ను మాత్రం జయించలేకపోతున్నారు.భారత్లో క్యాన్సర్ మహమ్మారి ప్రతి రోజూ 1,300 మందిని బలి తీసుకుంటోందట.
ఏటా కొత్తగా 12 లక్షల మంది దీని బారిన పడుతున్నారట.అంతేకాదు రాబోయే రోజుల్లో క్యాన్సర్ అనే సునామీ భారతదేశాన్ని ముంచేస్తుందని హెచ్చరించారు ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు, అమెరికాలో స్థిరపడిన భారతీయ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, మరో ఎన్ఆర్ఐ డాక్టర్ రేఖా భండారీ.
భారతదేశంలో క్యాన్సర్కు సంబంధించిన పరిస్ధితిపై వారిద్దరూ ఓ ఇంటర్వ్యూలో ఆందోళన వ్యక్తం చేశారు.ఫ్రాన్స్లోని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ ఐఏఆర్సీ అంచనా ప్రకారం 2030 నాటికి భారతదేశంలో ఏటా కొత్తగా 17 లక్షల క్యాన్సర్ కేసులు నమోదు కావచ్చునట.
దీనికి అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోతే పరిస్ధితి భయానకంగా తయారవుతుందన్నారు డాక్టర్ దత్తాత్రేయుడు.క్యాన్సర్ను కట్టడి చేయాలంటే దానిని తొలి దశలోనే గుర్తించాలని, అప్పుడే వ్యాధిని సులభంగా నయం చేయవచ్చునన్నారు.
డాక్టర్లకు, జనానికి క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించాలని ఇందుకోసం దేశవ్యాప్తంగా భారీ చర్యలు తీసుకోవాలని ఆయన భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించకపోవడం వల్ల అది ముదిరిపోయి, ప్రాణాంతకంగా మారుతోందని, అలాగే దేశంలో సరైన చికిత్సను అందించే సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమన్నారు.
భారత్లో క్యాన్సర్ విజృంభణకు పొగాకు వాడకమే ప్రధాన కారణమని నోరి దత్తాత్రేయుడు అభిప్రాయపడ్డారు.ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్లాక్ చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక సాయంతో క్యాన్సర్ను తొలి దశలోనే గుర్తించడం మరింత సులభం అవుతుందని ఆయన తెలిపారు.
పేద కుటుంబాల్లో క్యాన్సర్ ఎవరికైనా సోకితే.ఆ కుటుంబం సామాజికంగా, ఆర్ధికంగా చితికిపోతోందని ఇది ఒక రకంగా అసమానతలకు కారణమవుతోందని దత్తాత్రేయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం అమలు చేస్తోన్న ఆయుష్మాన్ భారత్, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు.
మరో డాక్టర్ రేఖా భండారీ మాట్లాడుతూ….ప్రజల్లో అవగాహన కల్పించడం, తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తించడం వల్ల ఈ మహమ్మారిని పదేళ్లలోనే జయించవచ్చునని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రస్తుతం ప్రపంచంలోనే ఎక్కువ మంది యువతతో భారత్ యంగ్ కంట్రీగా ఉందని.
కానీ మరో 20 ఏళ్లలో ఎక్కువ మంది వృద్ధులున్న దేశంగా నిలుస్తుందని ఆమె తెలిపారు.
నోరి దత్తాత్రేయుడు ప్రఖ్యాత తెలుగు డాక్టర్.
క్యాన్సర్ పరిశోధన, చికిత్సలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఆంకాలజిస్ట్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.దివంగత భారత రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి ఎందరో ప్రముఖులకు ఆయన విజయవంతంగా చికిత్సను అందించారు.
వైద్య రంగంలో దత్తాత్రేయుడు అందించిన సేవలకు గాను ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు ఆయనను వరించాయి.భారత ప్రభుత్వం సైతం 2015లో పద్మశ్రీ అవార్డుతో ఆయనను సత్కరించింది.
ఇక రేఖా భండారి సైతం అమెరికాలో స్థిరపడిన ఎన్ఆర్ఐ డాక్టర్.ఈమె జెరియాట్రిక్స్ పెయిన్ మెడిసిన్లో ఎక్స్పర్ట్.
ఈమె క్యాన్సర్ రీసెర్చ్లోనూ కీలకపాత్ర పోషించారు.డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, రేఖా భండారీలకు అమెరికా ప్రభుత్వం వలస పౌరులకు ఇచ్చే ఎలిస్ ఐలాండ్ మెడల్ హానర్తో సత్కరించింది.