నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో తన కుమార్తెను కులాంతర వివాహం చేసుకున్నాడనే కారణంతో పెరుమాళ్ల ప్రణయ్ అనే యువకుడిని అమ్మాయి తండ్రి అత్యంత దారుణంగా హత్య చేయించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం ప్రణయ్ కేసు విచారణ వేగంగా జరుగుతోంది.
ఈ కేసులో ప్రధాన నిందితులు మారుతీరావు, MA కరీమ్, శ్రావణ్లపై తాజాగా పీడీయాక్ట్ కూడా ప్రయోగించారు.
ఈ నేపథ్యంలో.అమృత ఇంట్లో అగంతకుడు తచ్చాడడం సంచలనంగా మారింది.వారి సిసి టివి ఫుటేజిలు పరిశీలించగా శనివారం తెల్లవారు జామున ఓ వ్యక్తి వారి ఇంటి ముందు కలియ తిరిగాడు.
గోడ ఎక్కి బాల్కానీలోకి వచ్చినట్టు గుర్తించారు.ఆగంతకుడు ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు.అప్పుడే అటుగా వచ్చిన పోలీసులను చూసి ఆగంతకుడు పారిపోయాడు.దీనికి సంబంధించి ప్రణయ్ తండ్రి బాలస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రణయ్ ఇంట్లోకి దుండగుడు ఎందుకు చొరబడ్డాడనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.దుండగుడు ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాడా? లేదా ప్రణయ్ భార్య అమృతను గానీ, అతడి తండ్రి బాలస్వామిని గానీ హత్య చేయడానికి వచ్చాడా అని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.భయాందోళనలకు గురవుతున్నారు.ప్రణయ్ ఆత్మ తమతో మాట్లాడుతోందంటూ పటాన్చెరువుకు చెందిన దంపతులు కొద్ది రోజుల కిందట బాలస్వామి ఇంటికి వెళ్లి కలకలం రేపిన విషయం తెలిసిందే.
మారుతీ రావు మరేదైనా కుట్రకు తెరతీశాడా అని ప్రణయ్ కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ రంగనాథ్ తెలిపారు.