ఈ మధ్య కాలంలో సీరియల్, సినిమా నటుల బలవన్మరణాలకి పాల్పడుతున్న ఘటనలు తరుచుగా చోటు చేసుకుంటున్నాయి.హిందీతో పాటు సౌత్ లో కూడా కొంత మంది నటులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
వీరిలో కొందరు అవకాశాలు లేక ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలకి పాల్పడితే, మరికొంత మంది వేధింపులు భరించలేక, ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.తాజాగా తెలుగు టీవీ సీరియల్ నటి మౌనరాగం ఫేమ్ శ్రావణి ఆత్మహత్య ఘటన సంచలనంగా మారింది.
ఎస్ ఆర్ నగర్లోని మధురానగర్లో తన నివాసంలో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
కాకినాడకు చెందిన శ్రావణి గత ఎనిమిది సంవత్సరాలుగా సీరియల్స్ లో నటిస్తుంది, మనసు మమత, మౌనరాగం సీరియల్స్ ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.అయితే చాలా కాలంగా టిక్ టాక్ వీడియోలు చేస్తున్న శ్రావణికి కొంత కాలం క్రితం దేవరాజ్రెడ్డి టిక్టాక్ ద్వారా పరిచయమయ్యాడు.
అయితే వారి మధ్య పరిచయాన్ని అవకాశంగా వాడుకొని దేవరాజ్ శ్రావణిని తరచు డబ్బులు ఇవ్వమంటూ వేధించే వాడని, ఈ కారణంగా తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ కేసు పెట్టారు.శ్రావణిని ప్రేమించినట్టు నమ్మించి ఆమెతో సన్నిహితంగా ఉంటూ ఫొటోలు దిగినట్లు తెలిపారు.
ఆ ఫొటోలు బయటపెడతానంటూ డబ్బులు డిమాండ్ చేశాడని వివరించారు. వేధింపులు అధికం కావడం వల్ల శ్రావణి ఇటీవల ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిందన్నారు.
పోలీసులు సకాలంలో యాక్షన్ తీసుకొని ఉంటే తమ కుమార్తె చనిపోయి ఉండేది కాదని శ్రావణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మౌనరాగం సీరియల్ లో చేసిన హీరోయిన్ అక్క పాత్ర శ్రావణికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.