భూతాపం పెరుగుతూ పోతున్న నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వాలు ఒత్తిడి తెస్తున్నాయి.ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన వారికి రాయితీలు కూడా ప్రకటిస్తున్నాయి.
పాత వాహనాలు అధిక కాలుష్యాన్ని వాతావరణంలోకి వెదజల్లుతున్నాయి కాబట్టి వీటిని వాడకూడదని ఆంక్షలు విధిస్తున్నాయి ప్రభుత్వాలు.కావాలంటే మీ ఓల్డ్ డీజిల్ లేదా పెట్రోల్ కార్లను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకుని వాడుకోవచ్చని సలహా ఇస్తున్నాయి.
అయితే డీజిల్ కార్లను ఎలక్ట్రిక్ కార్లగా మార్చవచ్చా? అలా మార్చాలంటే ఎంత డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది? తదితర విషయాలు ఇప్పుడు చూద్దాం.
పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లగా మార్చుకునేందుకు ఎలక్ట్రిక్ కిట్ను ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది.
పలు కంపెనీలు పాత కార్ల కోసం ఎలక్ట్రిక్ కిట్లను ఆఫర్ చేస్తున్నాయి.వీటి కోసం కనీసం రూ.5 లక్షల వరకు డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.రూ.5 లక్షలతో ఎలక్ట్రిక్ కిట్ కొంటే సింగిల్ ఛార్జ్ తో 80 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.సింగిల్ ఛార్జ్ పై 150 కిలోమీటర్లు ప్రయాణించాలంటే రూ.7 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది.పాత కారులో ఉన్న డీజిల్ ఇంజిన్, ఫ్యూయల్ ట్యాంక్ తో సహా ఇంజిన్ కు సంబంధించిన మిగతా పరికరాలన్నీ తీసివేసి ఈవీ కన్వర్షన్ కిట్ను ఇన్స్టాలేషన్ చేయాల్సి ఉంటుంది.
మీ ఓల్డ్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చే కంపెనీలే ఈ పనులన్నీ చేస్తాయి.కారులోపల చాలా మాడిఫికేషన్లు చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఖర్చుతో పాటు ఇది కాస్త సమయంతో కూడుకున్న పని.మీ పాత కారు టైర్లు, సీట్లు, కింది భాగం, రూఫ్, ఫ్రంట్ బంపర్ ఇలా అన్నీ ఉపయోగపడతాయి.కేవలం ఇంజన్ ను మాత్రమే పక్కన పెట్టేస్తారు.
ఈ రోజుల్లో పెట్రోల్, డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్లు ధర చాలా ఎక్కువగా ఉంది.అలాంటప్పుడు మధ్యతరగతి ప్రజలు ఇప్పటికిప్పుడే ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడం అసాధ్యంగా మారింది.ఈ నేపథ్యంలో ఈవీ కన్వర్షన్ కిట్ ప్రత్యామ్నాయంగా మారుతుంది.అయితే 5 లక్షలకు పైగా డబ్బు ఖర్చు చేసే ముందు ఎలక్ట్రిక్ కిట్ ఇన్స్టాలేషన్ వల్ల కలిగే లాభనష్టాలు కూడా ముందుగానే బేరీజు వేసుకోవాలి.
సేఫ్టీ, ఛార్జింగ్ పరంగా అన్ని విషయాలను తెలుసుకున్న తర్వాతే పాత కార్లను ఎలక్ట్రిక్ గా మార్చుకోవడం మంచిది.