ఖమ్మం పాలిటిక్స్ లో ఇప్పుడు వర్గ పోరు అధికార పార్టీలో మంటలు రాజేసేలా కనిపిస్తోంది.తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వరావు తనకు పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అసంతృప్తితో ఆయన అనుచరులు రగిలిపోతున్నారు .
ముఖ్యంగా ఎమ్మెల్యే కందాలు ఉపేందర్ రెడ్డి కి తుమ్మల నాగేశ్వరావు కి మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది.అది కాస్త గ్రూపు రాజకీయాలుగా మారాయి.
కందాల టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ తుమ్మల వర్గీయులను పక్కన పెట్టేస్తున్నారట.ఈ వ్యవహారాలన్నీ తుమ్మలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.
ముఖ్యంగా గా పార్టీ కమిటీల నియామకంలో తమకు అన్యాయం చేశారని.కందాల వర్గీయులకే అధిక ప్రాధాన్యం ఇచ్చారని తుమ్మల వర్గం ఆరోపణలు చేస్తోంది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసిన కందాల ఉపేందర్రెడ్డి తుమ్మలపై విజయం సాధించారు.ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోవడం, కాంగ్రెస్ నుంచి వలసలు తీవ్రం అయిన నేపథ్యంలో కందాల కూడా అధికార పార్టీలో చేరిపోయాడు.ఇక అప్పటి నుంచి టీఆర్ఎస్ అధిష్టానం కందాల ఉపేంద్రరెడ్డికి బాగానే ప్రాధాన్యం ఇస్తూ వస్తోంది.దీంతో ఆయన తన వర్గీయులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తుమ్మల వర్గీయులను పక్కన పెడుతూ వస్తున్నారట.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం తుమ్మల వర్గీయులు రహస్య సమావేశం నిర్వహించుకున్నారట.పార్టీకి సంబంధించిన విషయాల్లో కందాల తమకు అన్యాయం చేస్తున్నారని, ఇకపై తామే అభివృద్ధి పనులు చూసుకుంటామని, తామే కమిటీలు వేసుకుంటామని తుమ్మల వర్గం తీర్మానం చేసేసుకుంది.
దీనిని అధినేత కేసీఆర్ కు పంపించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.పైకి మాత్రం ఇది రహస్య మీటింగ్ కాదని, కేవలం పార్టీని ఖమ్మం జిల్లాలో ఎలా బలోపేతం చేయాలనే విషయం మీద మాత్రమే మీటింగ్ పెట్టుకున్నామంటూ చెబుతున్నారు.
గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన తుమ్మలకు అధినేత కేసీఆర్ ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చేవారు.అయితే 2018 ఎన్నికల్లో తుమ్మల ఓడిపోవడంతో సహజంగానే ఆయన ప్రాధాన్యత తగ్గిపోయింది.అయితే ఓడినా ఆయనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇస్తానని అంత భావించారు.ఒక దశలో తుమ్మలకు రాజ్యసభ సీటు వస్తుందని అనుకున్నారు.కానీ రాజ్యసభకు వెళ్లేందుకు తుమ్మల పెద్దగా ఆసక్తి చూపలేదనే వార్తలు కూడా వినిపించాయి.కేసీఆర్ కూడా తుమ్మల విషయంలో లైట్ తీసుకుంటున్నట్టుగా కనిపించడం అదే సమయంలో కందాల ఉపేంద్రరెడ్డికి ఎక్కువ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండడం, తమను పక్కన పెడుతున్నారని అభిప్రాయం ఈ మధ్యకాలంలో తుమ్మలలో ఎక్కువయ్యింది.
ప్రస్తుతం తుమ్మల అనుచరుల రహస్య మీటింగ్ పై టీఆర్ఎస్ లో చర్చ జరుగుతోంది.వచ్చే ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి బరిలో దిగేందుకు తుమ్మల రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ప్రస్తుతం అక్కడ సిట్టింగ్ ఎమ్యెల్యే ఉన్నా తరచుగా తుమ్మల పాలేరు నియోజకవర్గంలో తిరుగుతూ పట్టు పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.