కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నాయి.ఇప్పటికే లాక్ డౌన్ నాలుగో పర్వం నేటితో ముగిసింది.
అయితే ఈ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదు.ప్రతి రోజు దేశ వ్యాప్తంగా వేలాది సంఖ్యలో కరోనా కేసులు బయట పడుతున్నాయి.
అయితే ఆర్ధిక వ్యవస్థలు దెబ్బతినడంతో వాటిని తిరిగి గాడిలో పెట్టడానికి లాక్ డౌన్ నుంచి మెల్లగా మినహాయింపులు ఇస్తున్నారు.తాజాగా లాక్ డౌన్ ఐదో పర్వం కూడా మోడీ సర్కార్ ప్రకటించింది.
అయితే జూన్ 8 నుంచి ప్రార్ధనా స్థలాలు తెరవడానికి పర్మిషన్ ఇచ్చింది.ఇందులో భాగంగా తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయాన్ని తెరచి దర్శనాలు ప్రారంభించేందుకు టీటీడీ సిద్ధం అవుతుంది.
దీనికోసం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే దర్శనాలు తిరిగి ప్రారంభిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేదానిపై కార్యాచరణ సిద్ధం చేసి అమలులో పెట్టారు.భక్తులు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు జరిగిపోయాయి.క్యూలైన్లను జిగ్ జాగ్ చేశారు.
అలిపిరి, కాలి నడక మార్గాల్లో భక్తులకు వైద్య పరీక్షలు చేసిన తరువాతనే కొండపైకి అనుమతించాలని నిర్ణయించారు.రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే దర్శనాలను ప్రారంభిస్తామని టీటీడీ అధికారులు వెల్లడించారు.
భక్తులకు ఆన్ లైన్ తో పాటు కరెంట్ బుకింగ్ కౌంటర్ల ద్వారా టైమ్ స్లాట్ టోకెన్లు ఇస్తామని, దర్శనం ఉన్న భక్తులకు మాత్రమే తిరుమలలోకి ప్రవేశం ఉంటుందని స్పష్టం చేశారు.మాస్క్ లను ధరించడం, చేతులకు గ్లౌజ్ లు వేసుకోవడం తప్పనిసరని తెలిపారు.
ఇప్పటికే శ్రీవారి లడ్డూ ప్రసాదాలు విక్రయాలు బహిరంగంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇక దర్శనాలు ప్రారంభం అయితే వారికోసం ప్రయాణం సౌకర్యాలు ఎలా అనేదానిపై ఇప్పుడు ఆలోచిస్తున్నారు.