తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సంచలన నిర్ణయం తీసుకుంది.దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో ఎన్నారై భక్తులకు, విదేశాల నుండి వచ్చే భక్తులకు ఆంక్షలు విధించింది.
విదేశాల నుండి వచ్చే భక్తులు ఇండియాకు వచ్చిన 28 రోజుల తరువాత మాత్రమే తిరుమల దర్శనానికి రావాలని సూచించింది.ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
ఎవరైనా జలుబు, దగ్గు లాంటి లక్షణాలతో బాధ పడుతూ ఉంటే తిరుమల ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని టీటీడీ సూచించింది.తిరుమల లాంటి పుణ్యక్షేత్రాలలో కరోనా వేగంగా విజృంభించే అవకాశాలు ఉండటంతో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం.
దేశంలో ఇప్పటివరకూ 59 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కేరళ సీఎం ఈ నెలాఖరు వరకు పాఠశాలలు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడి 4,000 మంది మృతి చెందారు.కరోనా బాధితుల సంఖ్య 1,16,000 దాటింది.
చైనాలో కరోనా బారిన పడి 3,136 మంది మృతి చెందారు.ఇప్పుడిప్పుడే చైనాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది.
ఇటలీ, ఇరాన్, దక్షిణ కొరియా దేశాలలో కరోనా బారిన పడి పదుల సంఖ్యలో మృతి చెందారు.ఇరాన్ లో మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలు అమలు చేస్తోంది.