కులం గజ్జి లో కొట్టుకోకు అని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ఇప్పటికీ జనాల్లో మార్పు మాత్రం రావడం లేదు.కులం కులం అంటూ కూటికి కూడా పనికిరాని దాని కోసం జీవితాలనే నాశనం చేసుకుంటూ,వేరొకరి జీవితాలు కూడా నాశనం చేస్తున్నారు.
ఈ ఒక్క కులం కారణంగానే ఎంతో మంది ప్రేమికుల జీవితాలు ఛిద్రం అయిపోతున్నాయి.ఎన్ని హత్యలు జరిగిన దానిలో కూడా కులం అన్న కాన్సెప్ట్ పైనే ఈ దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.
అలాంటి ఈ కులం కారణంగానే గుంటూరు లో ఒక ఘటన చోటుచేసుకుంది.పచ్చని పందిట్లో ఓ పెళ్లి మధ్యలోనే ఆగిపోడానికి వధువు పేరుచివర ఆ సామాజికవర్గం పేరు లేకపోవడం తో వరుడు మండం నుంచి వెళ్లిపోవడం సభ్య సమాజాన్ని నివ్వెరపరిచేలా చేసింది.
గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.పెళ్లి కూతురు పేరు చివర ‘రెడ్డి’ అని తమ సామజిక వర్గం పేరు లేదన్న కారణంగా పెళ్లి పీటలపైనే పెళ్లిని ఆపేశారు అత్తింటివారు.
కాసేపట్లో మెడలో మూడుముళ్లు పడతాయనే సమయంలో ఆధార్ కార్డు లలో వధువు, ఆమె తండ్రి పేరు చివర “రెడ్డి” అని లేదని పీటలపై నుంచి లేచి వెళ్లిపోయాడు పెళ్లి కొడుకు.సత్తెనపల్లి మండలం గుడిపూడి గ్రామానికి చెందిన మున్నంగి వెంకట రెడ్డికి క్రోసూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయించారు.
వీరిద్దరికీ గుంటూరు సమీపంలోని పెదకాకాని మల్లేశ్వరస్వామి ఆలయంలో పెళ్లికి కూడా ఏర్పాట్లు చేశారు.అనుకున్న సమయానికి వధూవరులిద్దరూ పెళ్లికి రెడీ అయి ఆలయానికి వచ్చారు.
ఇక మరికొద్ది క్షణాల్లో పెళ్లి కొడుకు మూడు ముళ్లు వేస్తాడు అన్న సమయంలో అత్తింటివారు ఈ పెళ్లి క్యాన్సిల్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.కారణం అడిగితె ఆధార్ కార్డ్ లలో వారి పేర్ల చివర రెడ్డి అని లేదన్న ఒక్క కారణం గా వారు పెళ్లి ని వద్దు అనుకున్నట్లు తెలిపారు.దీనితో పెళ్లికూతురు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది.సమాజంలో ఎన్ని మార్పులు వచ్చినప్పటికీ ఈ కులం విషయంలో మాత్రం జనాలలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
ఎదుటివాడు మా కులమేనా అయితే అతడికి మద్దతిద్దాం,మన కులపు వాడు కాదా అయితే వదిలేద్దాం అంటూ జనాలు ఇప్పటికి కులానికే ప్రాధాన్యత ఇస్తున్నారు.