వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో ఆయన పలుకుబడిని అమాంతం పెంచేసింది.ఎటువంటి క్లిష్టమైన నిర్ణయమైనా క్షణాల్లో దానికి ఒక పరిష్కారం చూపిస్తూ అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ జగన్ డైనమిక్ సీఎంగా పేరు తెచ్చుకుంటున్నాడు.
అయితే ఇదే దూకుడు ఇప్పుడు ఆయనకు కొత్త కష్టాలు తెచ్చేలా కనిపిస్తోంది.తాజాగా జగన్ తీసుకున్న ఓ నిర్ణయం ఆయనకు కష్టాలు తీసుకొచ్చేలా కనిపిస్తోంది.
జగన్ తాజాగా తొలిసారి నిర్వహించిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ మొత్తం కూడా సంచలనాలకు వేదికగా మారిపోయింది.ప్రతి విషయాన్ని ఆయన కలెక్టర్లకు సవివరంగా చెప్పుకొచ్చారు.
ప్రజలు ప్రభుత్వం నుంచి ఏమి కోరుకుంటున్నారు, మనం వారికి ఏమి ఇవ్వాలి అనే విషయాలపై స్పష్టమైన అవగాహనతో జగన్ ముందుకు వెళ్తున్నారు.అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించేది లేదని, ఈ విషయంలో పార్టీ వారైనా మీరు లెక్క చేయకండి అంటూ జగన్ కలెక్టర్లకు చెప్పుకొచ్చారు.
ముఖ్యంగా అవినీతి, నిబంధనల ఉల్లంఘనలు అనే అంశాన్ని పదేపదే ప్రస్తావించారు.అలాంటివి జరిగితే, పరిణామాలు కూడా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.ముఖ్యంగా ఈ కలెక్టర్ల సదస్సు నిర్వహించిన ప్రాంగణం ప్రజావేదిక మీద జగన్ తీసుకున్న నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి.దీనిని గత సీఎం చంద్రబాబు ఎంతో ముచ్చటపడి నిర్మించుకున్నారు.
దాదాపు 10 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ నిర్మాణంపై అనేక విమర్శలు చెలరేగాయి.నదికి సమీపంలో కట్టడంతోపాటు సముద్ర మట్టానికి చాలా దివుగన నిర్మించడం, ప్రమాణాలు పాటించకపోవడం వంటివి ప్రధానంగా చర్చకు దారితీసాయి.
జగన్ ప్రభుత్వం రాగానే ఈ అక్రమ కట్టడాలపై కీలక నిర్ణయం తీసుకుంటారని అంతా భావించగా ఇప్పుడు జగన్ అదే బిల్డింగ్ లో కలెక్టర్ల సదస్సు నిర్వహించి అందరిని ఆశ్చర్యపరిచారు.
దీనిపై విమర్శలు చెలరేగుతున్న సమయంలోనే ఈ ప్రజావేదికను కూల్చేయాలంటూ కలెక్టర్ల సమావేశంలోనే జగన్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు.ఇదే ఇప్పుడు ఆయనకు చిక్కులు తీసుకొచ్చేలా కనిపిస్తోంది.అక్రమ నిర్మాణం అంటూ కూల్చేయబోతున్న ప్రజావేదిక తో పాటు అదే కృష్ణానది ఒడ్డున అనేక నిర్మాణాలు ఉన్నాయి.
మరీ ముఖ్యంగా స్వాముల ఆశ్రమాలు ఉన్నాయి.వైసీపీకి చెందిన కీలక నాయకుల కట్టడాలు కూడా ఉన్నాయి.
మరి వీటి పరిస్థితి ఏంటి ? వీటిలో బీజేపీ నాయకులకు చెందిన భూములు, భవనాలు కూడా కూడా ఎక్కువగా ఉండడంతో వాటి విషయంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తాడు అనేది తేలాల్సి ఉంది.అన్ని అక్రమ కట్టడాలను కూల్చేసేందుకు జగన్ సిద్ధపడితే రాజకీయంగా ఆయనకు తలనొప్పులు తప్పవు.