ఉండవల్లి లోని కరకట్ట వద్ద నిర్మించిన ప్రజావేదిక అక్రమ కట్టడం అని దానిని కూల్చివేస్తామని ఏపీ జగన్ సర్కార్ పేర్కొన్న విషయం తెలిసిందే.అయితే ఈ ప్రజావేదికను కూల్చవద్దు అంటూ కూల్చివేతపై స్టే విధించాలి అని కోరుతూ శ్రీనివాస్ అనే వ్యక్తి పిటీషన్ దాఖలు చేశారు.
అయితే పిటీషనర్ తరపు న్యాయవాది కృష్ణయ్య నిన్న అర్ధరాత్రి హైకోర్టు లో వేసిన హౌస్ మోషన్ పిటీషన్ పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించినట్లు తెలుస్తుంది.
ప్రజావేదిక అక్రమ కట్టడం కారణంగా హైకోర్టు దాని కూల్చివేతపై స్టే ఇవ్వడానికి నిరాకరించినట్లు తెలుస్తుంది.
అయితే ఈ పిటీషన్ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసినట్లు సమాచారం.మంగళవారం అర్ధరాత్రి నుంచి కూడా ఈ ప్రజావేదిక కూల్చివేత కార్యక్రమం చేపట్టింది ఏపీ ప్రభుత్వం.
జేసీబీ లను రప్పించి ఇప్పటికే 60 శాతం కూల్చివేత ప్రక్రియ పూర్తి అయినట్లు తెలుస్తుంది.ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి హౌస్ మోషన్ పిటీషన్ దాఖలు చేశారు శ్రీనివాస్ అనే పిటీషనర్.
అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించడం తో ప్రజావేదిక కూల్చివేతకు లైన్ క్లియర్ అయినట్లు అయ్యింది.గత ప్రభుత్వం టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ప్రజావేదిక ను నిర్మించారు.అయితే ఈ నిర్మాణం లో అవినీతి ఉందంటూ ఆరోపణలు వచ్చాయి.అంతేకాకుండా ఇది అక్రమ కట్టడం అంటూ గతంలో ప్రతిపక్షం లో ఉన్న సమయంలో కూడా వైసీపీ పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత ఈ అక్రమ కట్టడాలపై జగన్ సర్కార్ తీవ్ర నిర్ణయాలు తీసుకుంటుంది.