చైనాలోని వుహాన్లో పుట్టి ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్ధిక వ్యవస్ధల్ని కుప్పకూల్చి, లక్షలాది మంది మరణానికి కారణం కరోనా.వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడం గురించి ప్రపంచాన్ని మొదట్లోనే అప్రమత్తం చేయకుండా చైనా చేసిన తప్పిదం ఇప్పడు మానవాళి మనుగడనే ప్రమాదంలో నెట్టింది.
రోజు రోజుకు వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్నా.కోవిడ్ 19కు సంబంధించిన సమాచారం ఇవ్వకుండా చైనా నాన్చుడు ధోరణీలో వ్యవహరిస్తూ వాస్తవాలను కప్పిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది.
ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.వుహాన్లో అంతర్జాతీయ బృందంతో విచారణ చేయించేందుకు ఆయన పావులు కదుపుతున్నారు.
అలాగే తమ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంతటి కల్లోలానికి కారణమైన చైనా నుంచి నష్టపరిహారాన్ని వసూలు చేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నారు.ఇటీవలి కాలంలో చైనాపై మరింత ఒత్తిడి పెంచిన అగ్రరాజ్యాధినేతకు తోడుగా అక్కడి సెనేటర్లు కాంగ్రెస్లో ఓ కీలక బిల్లు ప్రవేశపెట్టారు.
కరోనా మహమ్మారి వ్యాప్తికి సంబంధించి పూర్తి వివరాలు అందించి సహకరించని పక్షంలో చైనాపై కఠిన ఆంక్షలు విధించాలన్నది ఆ బిల్లు సారాంశం.
‘‘ది కోవిడ్ 19 అకౌంటబిలిటీ యాక్ట్’’ పేరిట రూపొందించిన ఈ బిల్లును 9 మంది సెనేటర్లు మంగళవారం సెనేట్లో ప్రవేశపెట్టారు.కరోనా వైరస్ వ్యాప్తిలో చైనా పాత్రపై అమెరికా, దాని మిత్రదేశాలు, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థల విచారణకు చైనా పూర్తిగా సహకరించాలని బిల్లులో ప్రస్తావించారు.ఈ విషయంలో డ్రాగన్ దేశం పూర్తి సమాచారం అందించిందో, లేదో ట్రంప్ 60 రోజుల్లో కాంగ్రెస్కు తెలియజేయాలని బిల్లులో కోరారు.
దీనితో పాటుగా వైరస్ పుట్టుకకు కేంద్రంగా భావిస్తున్న చైనాలోని మాంస విక్రయశాలల్ని సైతం మూసివేయాలని సెనేటర్లు డిమాండ్ చేశారు.x ఒకవేళ అమెరికా కోరిన సమాచారం అందించడంలో చైనా విఫలమైతే విధించాల్సిన ఆంక్షల్ని కూడా సెనేటర్లు సూచించారు.
దీనిలో ప్రధానంగా ఆస్తుల్ని స్తంభింపజేయడం, ప్రయాణ నిషేధాలు, వీసా నిలుపుదల, అమెరికాకు చెందిన ఆర్ధిక సంస్ధల నుంచి రుణాల నిలిపివేత, అమెరికన్ స్టాక్ ఎక్స్ఛేంజీలలో చైనాకు సంబంధించిన సంస్థల్ని నిషేధించడం వంటివి ఉన్నాయి.కోరిన సమాచారం అందించకుండా చైనా సహకరించకపోతే పైన తెలిపిన ఆంక్షల్ని విధించేందుకు అధ్యక్షుడు ట్రంప్కు అధికారాలు కల్పించేలా బిల్లులో పేర్కొన్నారు.
వైరస్ వ్యాప్తికి సంబంధించి చైనా ఏమాత్రం సహకరించడం లేదని.కానీ తాజా చట్టం ద్వారా ఆ దేశంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని బిల్లు రూపకర్త లిండ్సే గ్రాహం అభిప్రాయపడ్డారు.చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రమేయం లేకుండా తమ దేశంలోకి కరోనా వైరస్ అడుగుపెట్టే అవకాశమే లేదని ఆయన ఆరోపించారు.మరోవైపు అమెరికా కరోనా సోకిన వారి సంఖ్య 1.4 మిలియన్లకు చేరింది.ఇప్పటి వరకు 83,082 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు.
.