అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.కాలిఫోర్నియాకు వాహన ఉద్గార ప్రమాణాలను నిర్ణయించే హక్కును తొలగించడంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం ఇలాంటి నిబంధనలను ఏర్పాటు చేయకుండా నిషేధించారు.
ఈ చర్య కారణంగా కారు ధరలు తగ్గుతాయని… ఉత్పత్తి పెరిగి మరిన్ని ఉద్యోగాలు లభిస్తాయని, కార్ల తయారీదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ట్రంప్ ట్వీట్ చేశారు.
అయితే ట్రంప్ నిర్ణయం రాష్ట్రాల హక్కుల కోసం న్యాయపోరాటం జరిగే విధంగా ఉందని నిపుణులు అంటున్నారు.అనుకున్నట్లుగానే కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ కార్ల భద్రతా ప్రమాణాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.కాలిఫోర్నియా వాహన భద్రతా ప్రమాణాలపై కఠిన నియమాలు పెట్టడం ఈనాటితో కాదు.1970 నుంచి ఫెడరల్ ప్రభుత్వం కంటే ఎక్కువగా ఉద్గారాలపై ఉక్కుపాదం మోపింది.
కాలిఫోర్నియా అనుసరించిన విధానాలనే మెజార్టీ రాష్ట్రాలు ఇప్పటికే పాటిస్తున్నాయి.
అమెరికాలోని మొత్తం కార్ల అమ్మకాలలో కాలిఫోర్నియా 12 శాతం వాటాను కలిగివుంది.అయితే ఈ కఠిన నిబంధనల కారణంగా కార్ల అమ్మకాలు తగ్గిపోతుండటంతో ఈ ఏడాది జూలైలో ఫోర్డ్, హోండా, వోక్స్ వ్యాగన్, బీఎండబ్ల్యూ వంటి దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు కాలిఫోర్నియా ప్రభుత్వంతో చర్చలు జరిపారు.
మరోవైపు పర్యావరణం విషయంలో బరాక్ ఒబామా కాలంలో అనుసరించిన విధానాలను ట్రంప్ పక్కనబెట్టేశారు.భూతాపం నియంత్రణకు అనుగుణంగా 2015లో కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతున్నట్లు ట్రంప్ ప్రకటించారు.ఈ ఒప్పందం ప్రకారం భూగోళపు సగటు ఉష్ణోగ్రతలను 2 డిగ్రీల సెల్సియస్ కన్నా కిందిస్థాయికి తగ్గించే లక్ష్యంతో 2015 డిసెంబర్ 12న ప్యారిస్లో 195 దేశాలు ఈ ఒప్పందం చేసుకున్నాయి.పారిస్ ఒప్పందానికి కట్టుబడినట్లయితే కర్బన ఉద్గారాల నియంత్రణకు అమెరికా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
పవన, సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పడంతో పాటు గ్రీన్ క్లైమెట్ ఫండ్కు ఏటా వందల కోట్ల డాలర్లను ఇవ్వాల్సి ఉంటుంది.