అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారాల జోరు పీక్ స్టేజ్ కి వెళ్ళిపోతోంది.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ అసలు సిసలు అగ్ర రాజ్య ఎన్నికల సిత్రాలను చూపిస్తున్నారు.
ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్ధులు బిడెన్, ట్రంప్ లు ఒకరిపై ఒకరు చేస్తున్న విమర్శలు అమెరికా ప్రజలను కన్ఫ్యూజన్ లోకి నెట్టేస్తున్నాయి.ట్రంప్ గెలిస్తే అమెరికా 100 ఏళ్ళు వెనక్కి వెళ్తుందని బిడెన్ విమర్శలు చేస్తుంటే బిడెన్ గెలిస్తే అమెరికా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కుంటుందో తెలుసా అంటూ తాజాగా ట్రంప్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ ఒహియోలో తన ప్రచారాన్ని చేపట్టారు.ఈ క్రమంలోనే ట్రంప్ ప్రత్యర్ధి బిడెన్ పై విరుచుకుపడ్డారు.
బిడెన్ గెలుపు చైనా గెలుపుతో సమానమని, బిడెన్ ని గెలిపిస్తే చైనా చెప్పుచేతల్లో అమెరికా ఉండాల్సిందేనని ట్రంప్ అన్నారు.మాజీ ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బిడెన్ చేసింది ఏమి లేదని అమెరికా ఆర్ధిక వ్యవస్థకి తీవ్రమైన నష్టం కలిగించిన చరిత్ర తనకు ఉందని ట్రంప్ అన్నారు.
బిడెన్ సమయంలో మన ఉద్యోగాలు చైనాకి వలస వెళ్లాయని, గడించిన నాలుగేళ్ల కాలంలో నేను మళ్ళీ వారిని వెనక్కి రాప్పించానని అన్నారు.
ఒహియోలో ఎంతో మంది చైనాలో పనిచేస్తుంటే వారిని మన దేశానికి తీసుకువచ్చానని ఒహియో ప్రచారంలో ట్రంప్ ప్రకటించారు.
నవంబర్ 3 న జరిగే ఎన్నికల్లో ప్రజలు మన దేశాన్ని అత్యున్నత స్థానంలో నిలపాలని భావిస్తే మరొక్క సారి అధికారం కట్టబెట్టండని అంటూనే బిడెన్ ని ఎన్నుకుంటే ఎలాంటి నష్టం జరుగుతుందో తెలిపారు. నాలుగు ట్రిలియన్ డాలర్ల మేరకు పన్ను పెంపుతో పాటు, ఒహియో బొగ్గు, చమురు, సహజవాయువుల ఒప్పదం రద్దు, చైనాకి ఉద్యోగాల తరలింపు వంటి సమస్యలు బిడెన్ గెలుపొందితే ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.
చైనా కాళ్ళ కింద అమెరికా ఉండాలా లేక అగ్ర రాజ్యంగా అమెరికా ఉండాలో మీరే నిర్ణయం తీసుకోవాలని ట్రంప్ ప్రకటించారు.