ఉద్యమ పార్టీగా పుట్టి రాజకీయ పార్టీగా మారడంతో పాటు తెలంగాణ సాధించిన క్రెడిట్ తో రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీని విజయవంతంగా ఈ స్థాయికి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుంది.ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీని స్థాపించడం ఏంటి , ఆ తరువాత వచ్చిన విజయలన్నిటికి కేసీఆర్ ప్రణాళికే కారణం.
ఇక ఆ పార్టీలో కీలక పదవుల్లో ఉన్నవారు అంతా కేసీఆర్ కు అత్యంత సన్నిహితులే.అయితే ప్రస్తుతానికి మాత్రం ఆ సన్నిహితులే గులాబీ బాస్ పై గుర్రుగా ఉండడంతో పాటు ఆయన మీద ప్రత్యక్షంగా, పరోక్షంగా సెటైర్లు వేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు.
చాలామంది టీఆర్ఎస్ కీలక నేతల కదలికల్లో తేడా వస్తోంది.మాటలు వేడిపుట్టిస్తున్నాయి.
అధికార టీఆర్ఎస్లో రోజురోజుకూ ధిక్కార స్వరాలు పెరుగుతున్నాయి.మరోవైపు చూస్తే కేంద్ర అధికార పార్టీ బీజేపీ రోజు రోజుకు తెలంగాణ లో బలం పెంచుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది.
ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్ఎస్ లో ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడం కలవరం పుట్టిస్తోంది.అది కూడా తెలంగాణాలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి ఈ పరిణామాలు ఊపందుకోవడంపై కేసీఆర్ లో కూడా అంతర్మధనం మొదలయ్యిందట.
ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సారూ.కారూ.పదహారు అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లినా ప్రతికూల ఫలితాలే వచ్చాయి.నిజామాబాద్లో కేసీఆర్ కూతురు కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోవడం ఇప్పటికీ ఆ పార్టీ నాయకులు ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక అప్పటి నుంచే తెలంగాణలో అధికార టీఆర్ఎస్కు ప్రతికూల పరిస్థితులు స్టార్ట్ అయినట్టుగానే కనిపిస్తోంది.పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో సాధించిన విజయంతో బీజేపీ మంచి జోష్ లో ఉంది.
ఆ ఉత్సాహం చల్లారకముందే ఆపరేషన్ ఆకర్శ్తో ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటూ టీఆర్ఎస్ కు సవాల్ విసురుతోంది.బీజేపీ దూకుడుకి గట్టిగా బ్రేకులు వేద్దామన్నా ప్రస్తుతం తమ సొంత పార్టీ నేతలే తమకు వ్యతిరేకంగా గళం ఇప్పడంతో కేసీఆర్ డైలమాలో పడిపోయారు.
సొంత పార్టీ నేతల అసంతృప్తిని ఎలా కంట్రోల్ చెయ్యాలో తెలియక కేసీఆర్ సతమతం అయిపోతున్నాడట.ఈ సమయంలో త్వరలో చేపట్టబోయే మంత్రి వర్గ విస్తరణ మరింత కాక రేపుతుందనే ఆందోళన కేసీఆర్ లో కనిపిస్తోంది.
మొన్నటికి మొన్న మంత్రి ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు.మంత్రి పదవి ఎవరి భిక్ష కాదని, గులాబీ ఓనర్లలో ఒకడినని ఆయన చెప్పుకొచ్చారు.ఈటలకు మద్దతుగా అనిపించేలా మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా గురుపూజోత్సవం వేడుకల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణాలో ఏపీ బోర్డుల స్థానంలో తెలంగాణ బోర్డులు వచ్చాయి తప్ప ఇంకేమి మారలేదని కుండబద్దలు కొట్టారు.
మరికొందరు నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.ఈ రచ్చ ఇలా సాగుతుండగానే ఇటీవల తెలంగాణకు నూతన గవర్నర్గా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు తమిళిసై సౌందర్రాజన్ను నియమించింది బీజేపీ ప్రభుత్వం.
ఇక ఇప్పటి నుంచి తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు మొదలయినట్టుగా కనిపిస్తోంది.రోజుకో గులాబీ నేత అధిష్టానంపై నిప్పులు చెరుగుతుండడంతో ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయో అనే ఆందోళన ఆ పార్టీ అగ్ర నాయకుల్లో కనిపిస్తోంది.
ఈ పరిస్థితులకు అడ్డుకట్ట వేసేందుకు కేసీఆర్ తగిన వ్యూహాలు రూపొందించుకుంటున్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతోంది.