తెలంగాణలో మరి కొద్ది నెలల్లోనే ఉప ఎన్నికలు ఉండడంతో, అన్ని పార్టీలు ముందుగానే మేల్కోంటున్నాయి.అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.
నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో అక్కడ ఎన్నికలు రాబోతున్నాయి.దీంతో అప్పుడే ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ పోటీ చేసేందుకు అభ్యర్థులు ఎంపిక చేసుకునే పనిలో పడ్డాయి.
ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో, ఆ ఫలితాలు రిపీట్ కాకుండా చూసుకునేందుకు టిఆర్ఎస్ సరి కొత్త ఎత్తుగడలతో ముందుకు వెళ్తోంది.దుబ్బాక లో ఓటమికి టిఆర్ఎస్ అభ్యర్థి బలంగా లేకపోవడం కారణం అనే అంచనాకు వచ్చిన టిఆర్ఎస్, నాగార్జున సాగర్ లో మాత్రం ఆ తప్పు రిపీట్ కాకుండా చూడాలని భావిస్తోంది.
అందుకే నోముల నర్సింహయ్య కుటుంబ సభ్యులకు కాకుండా , మరో కొత్త వ్యక్తికి ఇక్కడ స్థానాన్ని కట్టబెట్టాలని డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న జానారెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆయన బిజెపి నుంచి పోటీ చేసినా, లేక కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా ఎదుర్కొనేందుకు మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టిఆర్ఎస్ నాయకుడు మన్యం రంజిత్ యాదవ్ కు ఇక్కడ టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది.ఈ నియోజకవర్గంలో రంజిత్ యాదవ్ కు ఉన్న మంచి పేరుతో పాటు, యూత్ లో ఉన్న ఫాలోయింగ్ కూడా కలిసి వస్తుందని, ఆయనకు టిక్కెట్ ఇస్తే టిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమనే లెక్కల్లో ఉన్నారు.
యువ నాయకుడిగా నియోజకవర్గంలో ఆయన యాక్టివ్ గా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉండడంతో పాటు, ప్రజల్లోనూ మంచి పలుకుబడి ఉండడంతో ఆయన అయితేనే గెలుపు గుర్రం అవుతారని అభిప్రాయం కేసీఆర్ వ్యక్తం చేస్తున్నారు.అదీ కాకుండా యాదవ సామాజిక వర్గం కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా ఉండడం కూడా కలిసి వస్తుందని టీఆర్ఎస్ అంచనా వేస్తోంది.అయితే ఇదే టిక్కెట్ కోసం కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ ఎన్ఆర్ఐ గడ్డంపల్లి రవీందర్ రెడ్డి కూడా టికెట్ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.కానీ కేసీఆర్ మాత్రం రంజిత్ యాదవ్ వైపే మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.