తెలంగాణ అధికార పార్టీలో ఎప్పుడు ఏదో ఒక అంశం తెరపైకి రావడం ఆ పార్టీలో అసంతృప్తి చెలరేగడం సర్వ సాధారణంగా మారిపోయింది.ఇప్పటి వరకు సవాలక్ష ఇబ్బందులతో సతమతం అవుతున్న సీఎం కేసీఆర్ కు పార్టీకి చెందిన సీనియర్ నాయకులూ, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన నాయకుల నుంచి వస్తున్న అసమ్మతి గళాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది.
దీంతో రంగంలోకి దిగిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు రంగంలోకి దిగారు.ఇంతకీ విషయం ఏంటి అంటే టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్, టీడీపీ పార్టీల నుంచి ఇబ్బడిముబ్బడిగా నాయకులను, ఎమ్యెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు.
ఇక్కడే టీఆర్ఎస్ నాయకులకు కొత్తగా వలస వచ్చిన నాయకులకు మధ్య ఆధిపత్య పోరు మొదలయ్యింది.
కొత్తగా పార్టీలోకి వచ్చిన వారు తమ మీద పెత్తనం చేయకుండా పాత నాయకులు విడివిడిగా సభలు సమావేశాలు నిర్వహిస్తూ షాడో ఎమ్యెల్యేలుగా చలామణి అవుతుండడంతో పార్టీ మారి వచ్చిన నాయకులు, ఎమ్యెల్యేలు బాగా ఇబ్బందిపడుతున్నారు.ఇవి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ముదిరి గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.దీంతో టీఆర్ఎస్ లో కొత్త గొడవలు మొదలయ్యాయి.
ముందున్న సొంత పార్టీ నేతల కన్నా, వెనక నుంచి వచ్చి చేరిన ఫిరాయింపు నేతలకే అధిక ప్రాధాన్యత అన్నట్టుగా దీన్ని తెరాసలో కొందరి పరిస్థితి మారిపోవడంతో పాత నాయకులంతా అసంతృప్తికి గురవుతున్నారు.గత ఎన్నికల్లో కొంతమంది సీనియర్లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
అయితే, చాలా నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులపై గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి అధికార పార్టీలో చేరిపోయారు.మొదట్లో బాగానే వీరంతా ఉన్నట్టుగా పైకి కనిపించినా లోలోపల మాత్రం వీరి మధ్య అంతర్గత పోరు ముదురుతూ వచ్చింది.
ఈ మధ్యనే ఒక్కోటిగా ఆ కుమ్ములాటలు బయటకి వస్తున్నాయి.ముఖ్యంగా కొల్లాపూర్, నకిరేకల్, తాండూర్, పాలేరు, పినపాక, వైరా, మహేశ్వరం, ఇల్లెందు, ఎల్బీనగర్, ఎల్లారెడ్డి ఈ నియోజక వర్గాల్లో ఓడిన నాయకులకు, ఎమ్మెల్యేలకు మధ్య దూరం రోజు రోజుకి పెరుగుతూనే వస్తోంది.ఓడిన నాయకులు యాక్టివ్ గా ఉండడాన్ని గెలిచిన ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు.ఇదే అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగి స్వయంగా పార్టీకి చెందిన పాత నాయకులకు క్లాస్ పీకినట్టు సమాచారం.
నియోజక వర్గాల్లో ఎమ్మెల్యేలు మాత్రమే సమావేశాలు పెట్టాలనీ, ఓడినవారు స్పెషల్ మీటింగులు పెట్టకూడదని గట్టిగానే కేటీఆర్ క్లాస్ తీసుకున్నారట.దీంతో ముందు నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నవారిని కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం ఏంటి అంటూ వారు అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.