తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ఊహించని విధంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ వస్తోంది.ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అనే విషయం ఈ మధ్య జరిగిన గ్రేటర్ ఎన్నికలు నిరూపించాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తున్నా, పెద్దగా ప్రతిఫలం ఉండడం లేదు అనే అభిప్రాయం కేసీఆర్ లో కలిగింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఇప్పటి నుంచి పార్టీ లో సమూల మార్పులు, చేర్పులు చేయకపోతే, భవిష్యత్తు అంధకారంలో పడుతుందనే విషయాన్ని గుర్తించారు.
అందుకే ఈ విషయాలపై పూర్తిగా దృష్టి సారించారు.టిఆర్ఎస్ కు ఎదురులేకుండా ప్రధాన ప్రత్యర్ధిగా మారిన బీజేపీని ఇరుకున పెట్టడమే ధ్యేయంగా కేసీఆర్ సరికొత్త ఎత్తుగడలను వేస్తున్నారు.
దీంతో పాటే పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడా లోటు పాట్లు లేకుండా చూసుకునే విషయంపైన దృష్టి పెట్టారు.
ముఖ్యంగా పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం ఉండాలనే విషయాన్ని కేసీఆర్ గుర్తించారు.
మార్చిలోపు తెలంగాణ సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగించి, పూర్తిగా తాను తెరవెనుక ఉండి పార్టీని పటిష్టం చేసే విషయంపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నారు.అందుకే తెలంగాణ వ్యాప్తంగా పార్టీలో మంచి పట్టు, జనాల్లో మంచి ఆదరణ ఉన్న తన మేనల్లుడు మంత్రి హరీష్ రావుకు పార్టీలో ప్రాధాన్యం పెంచాలని చూస్తున్నారు.
దీనిలో భాగంగానే టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరీష్ రావు ను నియమించాలని చూస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ఎలాగూ కేటీఆర్ సీఎం స్థానంలో ఉంటే, పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారని అందుకే రాజకీయ వ్యూహాలు బాగా తెలిసిన వ్యక్తిగా, టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి తన వెంటే నడుస్తున్న హరీష్ రావు కు ఆ పదవిని అప్పగిస్తే ఫలితం ఉంటుందనే ఆలోచనతోనే ఆయనను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీలు నాయకుల మధ్య చర్చ జరుగుతోంది.క్రమ క్రమంగా బలం పెంచుకుంటూ వస్తున్న బీజేపీకి అడ్డుకట్ట వేయడంలో హరీష్ ముందుంటారని, పార్టీలో నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరు అని భావిస్తున్నారు.అదీకాకుండా 2022 లోనే జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే వీటిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినట్లు గా కనిపిస్తున్నారు.