తెలంగాణలో అధికార పార్టీ తమ హవా రోజురోజుకు పెంచుకుంటూ బలమైన పార్టీగా అవతరిస్తూ వస్తుండగా, జాతీయ పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలహీనపడి ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది.తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడ్డ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత నుంచి పార్టీలోని నాయకులు, కార్యకర్తలు అధికార పార్టీ వైపు వలస వెళ్తున్నా ఆపలేని దుస్థితిలో చూస్తూ ఉండిపోయింది.
ఇక పార్టీలో మిగిలి ఉన్న నాయకుల మధ్య కూడా సమన్వయం లేకుండా గ్రూపు రాజకీయాలతో ఆ పార్టీ సతమతమవుతోంది.ప్రస్తుతం తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవ్వడంతో అన్ని రాజకీయ పార్టీలు హడావుడిగా ఉన్నాయి.
టిక్కెట్ల కోసం పోటీ తీవ్రంగా నెలకొంది.ఆయా పార్టీల నుంచి టికెట్లు దొరకని నాయకులంతా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ టికెట్ల బెడద అధికార పార్టీ టిఆర్ఎస్ లో ఎక్కువగా ఉండడంతో తమకు అవకాశం దొరకని వారంతా ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తూ, ఆ పార్టీలో చేరి టిక్కెట్లు దక్కించుకుంటున్నారు.అయితే నాయకుల వలసలను అరికట్టడంలో టిఆర్ఎస్ విఫలం కావడంతో ఈ వలసలు మరింతగా ఊపందుకున్నాయి.
గత పదేళ్లలో ఏ పార్టీలో చేరానన్ని చేరికలు టీఆర్ఎస్ లో జరిగాయి.టిడిపి నుంచి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ లో నాయకులు చేరారు.టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తరహా చేరికలు ఎక్కువయ్యాయి.
దీని కారణంగా గులాబీ పార్టీలో లెక్కకు మించి నాయకులు తయారయ్యారు.వీరి మధ్య ఆధిపత్య పోరు మొదటి నుంచి ఉంది.ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఆ విషయం బాగా అర్థం అవుతోంది.
ఇప్పుడు టిక్కెట్లు దక్కని వారంతా ఇలా కాంగ్రెస్ గూటికి చేరడంతో పాటు ఆ పార్టీ బి ఫాం లు కూడా దక్కించుకుని పోటీకి సై అంటున్నారు.ఈ పరిణామాలు టిఆర్ఎస్ లో కలవరం పుట్టిస్తున్నాయి.
ఇవి ఖచ్చితంగా తమ పార్టీ అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయని ఆందోళన చెందుతున్నాయి.ఈ పరిణామాలపై సీరియస్ గా దృష్టిపెట్టాల్సిందిగా కేసీఆర్ మంత్రులకు, ఎమ్యెల్యేలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.