తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఈ మధ్యకాలంలో ఎక్కడలేని తలనొప్పులు పెరిగిపోతున్నాయి.పరిపాలన ఒక పక్క, వలసలు మరోపక్క, సొంత పార్టీ నాయకుల గ్రూపు రాజకీయాలు మరో పక్క ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కుంటూ పరిపాలన కొనసాగిస్తున్నాడు.
తెలంగాణ లో బీజేపీ టీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడమే పనిగా పెట్టుకుని ముందుకు వెళుతూ రకరకాల ఎత్తుగడలు వేస్తూ కేసీఆర్ ను ఇబ్బందిపెడుతూ వస్తోంది.ఇదే సమయంలో ఈటెల రాజేందర్ వంటి నాయకులు పరోక్షంగా కేసీఆర్ కు గట్టి వార్నింగ్ లు ఇస్తూ బహిరంగంగా వ్యాఖ్యానించడంతో కేసీఆర్ పరువు బజారున పడింది.
ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించే పనిలో ఉన్నాడు.ఈ సందర్భంగా కొంతమందికి ఉద్వాసన పలికి మరికొంతమందికి చోటు కల్పించే పనిలో ఉన్నాడు.
సరిగ్గా ఇదే సమయంలో టీఆర్ఎస్ లో ఉన్న మహిళా నాయకులు కేసీఆర్ మీద అసంతృప్తితో రగిలిపోతున్నారట.
టీఆర్ఎస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి ఇంతకాలం అయినా మహిళా నాయకుల గురించి కేసీఆర్ పట్టించుకోవడంలేదనేది వీరి ప్రధాన ఆరోపణ.ఇదే విషయమై కేసీఆర్ ను కలిసి అనేకమార్లు విన్నవించినా ఫలితం మాత్రం కనిపించడంలేదని వీరంతా ఆగ్రహంతో ఊగిపోతున్నారు.ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పురుషులతో సమానంగా పోరాటాలు చేసిన మహిళా నేతలు, ఇప్పుడు ఆవేదనతో రగిలిపోతున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి ఆరేళ్లు అవుతున్నా, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల్లో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని వీరి ఆరోపణ.ఇదే విషయమై తేల్చుకునేందుకు తెలంగాణ భవన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా, కనీసం పార్టీ ముఖ్యనేతలు ఎవరూ పట్టించుకోవడమేలేదని వీరు ఆరోపిస్తున్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థలు, మార్కెట్ కమిటీల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు అమలు చేసినా, నామినేటెడ్ పోస్టుల్లో, పార్టీ పదవుల్లో మాత్రం మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదనేది టీఆర్ఎస్ లో జరుగుతున్న చర్చ.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం, టీఆర్ఎస్ పార్టీ కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసిన తమను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన ఒకరిద్దరు మహిళా నాయకులకు ప్రాధాన్యం ఇచ్చారని వీరు ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేస్తున్నప్పటికీ మహిళా నాయకుల అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోవడంలేదంటూ వీరు బాధపడుతున్నారు.నామినెటేడ్ పోస్టుల్లో తమకు అవకాశాలు ఇవ్వాలని పదే పదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు విజ్ఞప్తి చేస్తున్న ప్రయోజనం లేదని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు, క్యాబినెట్లో ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోవడం వివక్ష కాదా అంటూ వీరు ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయమై ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేస్తున్నా పార్టీ అధిష్టానం పట్టించుకోవడంలేదని, మహిళల నేతలంటే కేసీఆర్ కు అంత చులకనా అంటూ వీరు ప్రశ్నిస్తున్నారు.అయితే ఈ మహిళా నేతల ప్రశ్నలకు కేసీఆర్ ఏ విధంగా బదులిస్తారో చూడాలి.