ఏపీ లోనే జనసేన పార్టీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉంది.అక్కడ బలపడేందుకు అధికార పార్టీ గా జనసేన ను మార్చేందుకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంతగానో శ్రమిస్తున్నారు.
సొంతంగా అధికారం చేపట్టే ఛాన్స్ లేకపోయినా, కనీసం ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారం పంచుకోవాలి అనేది పవన్ రాజకీయ ఎత్తుగడ .అయితే అదే ఆలోచనతో 2024 నాటికి టిడిపితో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు.ఇప్పటికే బీజేపీ , జనసేన పొత్తు కొనసాగుతోంది.ఏదో ఒక రూట్ లో తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అన్నదే పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.ఏపీ లో బలం అంతంత మాత్రంగా ఉండగా, తెలంగాణలో జనసేన పరిస్థితి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అక్కడ పార్టీ ఉన్నా, పెద్దగా ప్రభావం చూపించ లేక పోతోంది.
ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తప్ప, మిగతా అన్నిచోట్ల పోటీకి జనసేన దూరంగానే ఉంది.ఇక అధికార పార్టీ టిఆర్ఎస్ ను విమర్శించేందుకు జనసేన పార్టీ ఎప్పుడు సాహసించలేదు.
ఇక వారితో సన్నిహితంగా మెలిగేందుకు పవన్ ప్రయత్నిస్తూ వస్తున్నారు.ఇదిలా ఉంటే 2023 ఎన్నికల్లో జనసేన పార్టీ మద్దతు కూడగడితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో కెసిఆర్ ఉన్నారట.
ఇప్పటికే పార్టీ రెండు సార్లు అధికారంలోకి రావడంతో, మూడో సారి ఎన్నికల్లో విజయం సాధించాలంటే అది ఆషామాషీ వ్యవహారం కాదని కేసీఆర్ గ్రహిస్తున్నారు.ప్రభుత్వ వ్యతిరేకత సాధారణంగానే ఎక్కువగా ఉంటుంది.
దీనికితోడు బిజెపి నుంచి ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది.అందుకే వామపక్ష పార్టీలను దగ్గర చేసుకోవడంతో పాటు, పనిలో పనిగా జనసేన మద్దతు కూడగడితే, రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ కు ఇబ్బంది ఉండదని, మళ్ళీ అధికారంలోకి రావచ్చు అనే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు టిఆర్ఎస్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.
కేటీఆర్- రామ్ చరణ్ మంచి స్నేహితులు కావడం , మెగాస్టార్ చిరంజీవి సైతం కెసిఆర్ తో సన్నిహితంగా మెలుగుతూ ఉండడం ఇవన్నీ లెక్కలోకి తీసుకునే ఈ పొత్తు ప్రతిపాదనకు కెసిఆర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.అయితే బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన , తెలంగాణలో బీజేపి కి వ్యతిరేకంగా తమకు మద్దతు ఇస్తుందా అనే సందేహాలు ఉన్నా, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్థికి కాకుండా టిఆర్ఎస్ అభ్యర్థికి జనసేన మద్దతు ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకునే ఈ ప్రతిపాదన పవన్ ముందు పెట్టేందుకు టిఆర్ఎస్ సిద్ధమవుతున్నట్లు సమాచారం.జనసేన మద్దతు ఉంటే పెద్ద ఎత్తున ఉన్న పవన్, మెగా అభిమానులతో పాటు, కొన్ని సామాజిక వర్గాల మద్దతు, తెలంగాణలోని ఏపీ సెటిలర్స్ మద్దతూ తమకు లభిస్తాయి అనే లెక్కల్లో కేసీఆర్ ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.
మొత్తంగా కాకపోయినా కొంతవరకైనా తమకు కలిసి వస్తుంది అని ఆలోచనతోనే ఈ ప్రతిపాదన పెట్టేందుకు సిద్ధమవుతున్నారట.