తెలంగాణలో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న నియోజకవర్గం దుబ్బాక.సిద్ధిపేట జిల్లాలో కేసీఆర్ సొంత నియోజకవర్గం అయిన సిద్ధిపేటను ఆనుకుని ఉండే దుబ్బాక నియోజకవర్గం టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది.
ఇక్కడ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆ పార్టీ కీలక నేత తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది.ఈ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిపికేషన్ రిలీజ్ చేసింది.
ఈ క్రమంలోనే బీజేపీ ఇప్పటికే ప్రచార రంగంలో దూసుకు పోతోంది.గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన ఆ పార్టీ కీలక నేత రఘునందన్ రావు ప్రచార పర్వంలో దూసుకు పోతున్నాడు.
రఘునందన్ ఇప్పటికే రెండు సార్లు మెదక్ ఎంపీగా, దుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆయనపై సానుభూతి ఉండడంతో పాటు నియోజకవర్గంలో ఉన్న పరిచయాల నేపథ్యంలో నెల రోజుల నుంచే ప్రచారం చేస్తున్నారు.ఇక కాంగ్రెస్ కూడా తన అభ్యర్థిని ప్రకటించేసినట్టే.
గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పేరును ఆదివారం జరిగిన సమావేశంలో టీ పీసీసీ ఫైనలైజ్ చేసింది.ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు పాల్గొన్నారు.
ఇక్కడ మెజార్టీ సభ్యులు నర్సారెడ్డినే ఉప ఎన్నిక సంగ్రామంలో దించాలని సూచించడంతో ఆయన పేరే ఇక్కడ ఈ నెల 7వ తేదీన అధికారికంగా ప్రకటించనున్నారు.దుబ్బాక ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ ఏకంగా 147 మంది ఇన్చార్జులను నియమించింది.
ప్రధాన పార్టీలు రెండు అభ్యర్థులను ప్రకటించినా అధికార టీఆర్ఎస్ అభ్యర్థి విషయంలో ఇంకా డైలమాలోనే ఉంది.రామలింగారెడ్డి తనయుడికి సీటు ఇస్తే మరో మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు, ఆయన వర్గం ఎంత వరకు సహకరిస్తుందన్న సందేహాలు ఉన్నాయి.
ఈ రెండు వర్గాలను సమన్వయం చేసే క్రమంలో ఇప్పటకీ దుబ్బాక అభ్యర్థిని ఎంపిక చేసేందుకు హరీష్రావు వెనకా ముందు ఆడుతున్న పరిస్థితే కనిపిస్తోంది.