మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ గడ్డపై బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించబోతున్నారు .ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బిజెపి కీలక నాయకులంతా హాజరు కాబోతుండడంతో , ఈ సభను సక్సెస్ చేసే విధంగా తెలంగాణ బిజెపి నాయకులు గట్టిగానే కష్టపడుతున్నారు.
తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావాలనే పట్టుదలతో ఉన్న కేంద్ర బిజెపి పెద్దలు ఈ సభను ఉపయోగించుకుని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా అనేక వ్యూహాలు రచిస్తున్నారు.అయితే బిజెపి సభలో బిజెపి పెద్దలు ఏమేం మాట్లాడబోతున్నారు ? దానికి కౌంటర్ ఏవిధంగా ఇవ్వాలనే విషయంపై టిఆర్ఎస్ ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేసుకుంటోంది.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ముందు నుంచే సిద్ధం అవ్వాలని నిర్ణయించుకుంది .అంతేకాకుండా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటనలకు ప్లాన్ చేసుకుంటున్నారు.పార్టీ ఆఫీసులు ప్రారంభం, సభలు సమావేశాలు పెద్ద ఎత్తున నిర్వహించి తెలంగాణలో టిఆర్ఎస్ చేసిన అభివృద్ధి , కేంద్రం తెలంగాణకు ఏమీ చేయలేదనే విషయాన్ని జనాల్లోకి తీసుకు వెళ్లే విధంగా కెసిఆర్ వ్యూహాలు రచిస్తున్నారు.నియోజకవర్గాల వారీగా భారీ ఎత్తున సభలు నిర్వహించాలని ఈ సభల్లో బిజెపి తీరును ఎండగట్టే విధంగా ప్రసంగాలు చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
అయితే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఏ ఏ అంశాలపై తీర్మానం చేస్తారు ? ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఏ అంశాలపై మాట్లాడుతారు ? తెలంగాణపై ఏమైనా కామెంట్ చేసే అవకాశం ఉందా, అలాగే తన పరిపాలన గురించి ప్రస్తావించబోతున్నారా అనే విషయాలను ఇప్పటి నుంచే ఆరా తీసే పనిలో ఉన్నారు.
ప్రస్తుతం టిఆర్ఎస్ పై ఎవరు విమర్శలు చేసినా … టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ఘాటుగా స్పందిస్తున్నారు.బిజెపి సభల తర్వాత ఆ పార్టీని మరింతగా టార్గెట్ చేసుకోవాలని టిఆర్ఎస్ భావిస్తోంది.ప్రజలకు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు అంతా అందుబాటులో ఉండే విధంగా చూడడంతో పాటు, బీజేపీ చేసే విమర్శలకు ఘాటుగా సమాధానం ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నేతలకు ఆదేశాలు వెళ్లాయి.
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో టిఆర్ఎస్ పై చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు ఒక ప్రత్యేక టీమ్ ను సిద్ధం చేసుకుంటున్నారట.