నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన జోష్ లో టిఆర్ఎస్ పార్టీ ఉంది.కవిత మంత్రిగా ఎప్పుడు బాధ్యతలు స్వీకరిస్తారు ? ఆమెకు ఏ శాఖ దక్కబోతోంది అనే ఊహాగానాలతో ఒకవైపు టీఆర్ఎస్ లో సందడి నెలకొనగా, మరోవైపు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలియక టిఆర్ఎస్ లో టెన్షన్ నెలకొంది.మొన్నటి వరకు గ్రేటర్ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తూ వచ్చినా, ఇప్పుడు మాత్రం ఆ నమ్మకం పెద్దగా కనిపించడం లేదు.గ్రేటర్ ఎన్నికలను అంతంత ప్రతిష్తత్మకంగా తీసుకుని, ఇది తన పనితీరుపై నిదర్శనంగా చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్ సైతం గ్రేటర్ పై కంగారుపడుతున్నారట.
ప్రస్తుతం హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా లోతట్టు ప్రాంతాలు అన్నీ, జలమయం కావడంతో పాటు హైదరాబాద్ మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది.ఇళ్లల్లోకి నీళ్లు సైతం వెళ్లి ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇదే అదునుగా టీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలన్నీ ఈ వర్షాలతో ప్రజలు ఎదుర్కుంటున్న ఇబ్బందులను హైలెట్ చేస్తున్నాయి.ప్రస్తుతం ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లలేని విధంగా కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు ఉన్నాయి.
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్యులు పడుతున్న ఇబ్బందులు, వారి బాధలు అన్ని తమకు వ్యతిరేకం గా మారతాయేమో అన్న భయం ఇప్పుడు టిఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హైదరాబాద్ కోసం ఎంతగానో ఖర్చు చేశామని, ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, తెలంగాణ ప్రభుత్వం బలంగానే వాదిస్తూ వచ్చింది.ఇప్పటికే ఈ వ్యవహారంపై బీజేపీ, కాంగ్రెస్ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో, ఈ వర్షాలు టిఆర్ఎస్ ను మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి.ఇవే అంశాలను హైలెట్ చేసుకుంటూ, తమ రాజకీయ ప్రత్యర్ధులు జనాల్లోకి వెళుతున్న తీరు టీఆర్ఎస్ కు మరింత టెన్షన్ కలిగిస్తోంది.
అసలు హైదరాబాద్ కు టిఆర్ఎస్ ఏమీ చేయలేదనే విధంగా విమర్శలు చేస్తూ ఉండడం, ప్రజల్లోనూ టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం కనిపిస్తుండటం, హైదరాబాద్ కు తాము ఎంత చేసినా, ఈ వర్షాల కారణంగా అది అంతా డ్యామేజ్ అయిందనే బాధ టిఆర్ఎస్ నేతల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఇప్పటికే డ్రైన్లను ఆక్రమించి కట్టిన కట్టడాలపై టిఆర్ఎస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ వస్తోంది.
కాకపోతే కొంతమంది విషయంలో సడలింపులు ఇవ్వటం వంటివి టిఆర్ఎస్ పై విమర్శలు పెరగడానికి కారణం అయింది.ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలి అని చూస్తున్నా, టిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు వర్షాలు పెద్ద చిక్కు పెట్టినట్టుగానే కనిపిస్తున్నాయి.