గ్రేటర్ ఎన్నికల్లో తమ సత్తా నిరూపించుకుని, మళ్లీ జనాలంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారనే అభిప్రాయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంలో ఆ పార్టీ అగ్ర నాయకులు అంతా గట్టిగానే చెమటోడుస్తున్నారు.తెలంగాణ మంత్రి కేటీఆర్ గ్రేటర్ పై టీఆర్ఎస్ జెండా రెపరెపలాడించాలని గట్టిగానే కష్టపడుతున్నారు.
టీఆర్ఎస్ కు బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది.కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రంగా ఉండడంతో, ప్రధాన ప్రతిపక్షం తామే అన్నట్లుగా బిజెపి వ్యవహరిస్తూ స్పీడ్ పెంచింది.
గ్రేటర్ లో బిజెపికి కాస్తో కూస్తో బలంగా ఉండడంతో, గట్టిగానే పోటీ ఇచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తోంది.గ్రేటర్ పై పట్టు నిలుపుకుంటూ, ఎదురులేకుండా చేసుకోవాలి అనే అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది.
అయినా అధికార పార్టీ ఎత్తుగడల ముందు తమకు పెద్దగా అవకాశం ఉండదనే భయం కూడా వెంటాడుతోంది.ఈ క్రమంలోనే తమ మిత్రపక్షంగా ఏపీలో కొనసాగుతున్న జనసేన ను గ్రేటర్ ఎన్నికల్లో చురుగ్గా ఉండేలా చేయగలిగితే, తమకు తిరుగే ఉండదు అనే అభిప్రాయం లో ఆ పార్టీ ఉంది.
ఇప్పుడు పవన్ అకస్మాత్తుగా గ్రేటర్ లో కమిటీలను నియమించడం అందరికీ షాక్ కలిగించింది.ముఖ్యంగా టిఆర్ఎస్ కు పవన్ వ్యవహారం మింగుడు పడడం లేదు.వందకు పైగా స్థానాల్లో తాము పాగా వేయాలని చూస్తుంటే, అకస్మాత్తుగా పవన్ తెరపైకి రావడం, బిజెపి జనసేన కలిస్తే ఓటర్లను ప్రభావితం చేయగలరనే భయం ఇప్పుడు టిఆర్ఎస్ ను వెంటాడుతోంది.ఇప్పటికే పవన్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 50 డివిజన్ లలో పార్టీ కమిటీలనునియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అకస్మాత్తుగా పవన్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ కేంద్ర పెద్దల హస్తం ఉండడంతో, ఇప్పుడు పవన్ ఎదుర్కొనేందుకు ఎటువంటి అస్త్రాలను ఉపయోగించాలి అనే విషయంపై టిఆర్ఎస్ ఆలోచనలో పడింది.బీజేపీతో కలిసి జనసేన కొన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉండడం, పవన్ కు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అభిమానులు ఎక్కువగా ఉండటం, సెటిలర్ల ఓటర్లు అటు వైపు మళ్లే అవకాశం ఉండడం, ఇవన్నీ లెక్కలు వేసుకుంటున్నారు.
పవన్ ను ధీటుగా ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలను టీఆర్ఎస్ సిద్ధం చేసుకుంటోంది.ఇప్పుడు పవన్ ఎంట్రీతో గ్రేటర్ పరిధిలో రాజకీయ సమీకరణాలు శర వేగంగా మారే అవకాశం కనిపిస్తోంది.