ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో, ఎవరు ఎప్పుడు తిరుగుబాటు జెండా ఎగరవేస్తారో చెప్పలేని పరిస్థితుల్లో తెలంగాణ రాజకీయాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి.మొన్నటి వరకు కాంగ్రెస్, టీడీపీ నుంచి నాయకులు వలస వచ్చి టీఆర్ఎస్ లో చేరగా ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వలసలు మొదలయ్యేట్టుగా కనిపిస్తున్నాయి.
ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఈ దుస్థితి రావడానికి కారణం మంత్రి వర్గ విస్తరణే కారణంగా తెలుస్తోంది.కేబినెట్ విస్తరణలో భాగంగా పదవులు దక్కని ఆశావహులు తమ నిరసన గళాన్ని ఒక్కొక్కరిగా వినిపిస్తున్నారు.
విస్తరణ కంటే ముందుగానే ఇద్దరి మంత్రి పదవులు పొతున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం మొదలవ్వడంతో వారంతా ఉలిక్కిపడి తమకు నష్టం జరగక ముందే మేల్కొని సొంత పార్టీ మీద విమర్శలు గుప్పించారు.ఆ తరువాత చాలా మంది నాయకులు తమ అసంతృప్తిని బహిరంగంగా వెళ్లగక్కడం, వారిని కేసీఆర్, కేటీఆర్ బుజ్జగించడం జరిగాయి.
అయినా అసంతృప్తి జ్వాలలు మాత్రం ఇంకా చల్లారినట్టు కనిపించడంలేదు.
అయితే ఈ అసంతృప్తులన్నిటిని తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేసుకుంటున్నట్టు కనిపిస్తోంది.ఓవైపు చూస్తే పార్టీలో దిక్కార స్వరాలు రోజు రోజుకి పెరిగిపోతుండగా మరోవైపు బీజేపీ వేస్తున్న ఎత్తులతో టీఆర్ఎస్ బలహీనం అయ్యే పరిస్థితికి వచ్చింది.ప్రస్తుతం టీఆర్ఎస్ కు చెందిన 12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ కేంద్ర అధిష్టానంతో టచ్లో ఉన్నట్టు వార్తలు బయటకి పొక్కడంతో టీఆర్ఎస్ అగ్ర నాయకుల్లో కలవరం మొదలయ్యిందట.
ప్రస్తుతం ఈ పార్టీలో ఉన్నా తమకు పదవులు వచ్చే ఛాన్స్ లేదని, అలాగే వచ్చే ఎన్నికలనాటికి బీజేపీ ఇక్కడ అధికారం తప్పకుండా చేజిక్కించుకుంటుంది అనే నమ్మకంతో చాలామంది ఎమ్యెల్యేలు బలంగా నమ్ముతున్నారట.అదీ కాకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండడం కూడా వారు పార్టీ మారేందుకు కారణంగా మారిందట.
మంత్రివర్గ విస్తరణలో కొందరికే మంత్రి పదవులు రావడంతో అనేక మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఢీలా పడిపోయారట.ఏకంగా మాజీ మంత్రులు జోగు రామన్న, నాయిని నర్సింహారెడ్డి, కడియం శ్రీహరి, డాక్టర్ రాజయ్య వంటి సీనియర్ నాయకులు నిరుత్సాహనికి గురయ్యారు.ఇందులో జోగు రామన్న, నాయిని, రాజయ్యలు కేసీఆర్ వ్యవహారంపై దిక్కారస్వరాలు వినిపించగా, కడియం మాత్రం సైలెంట్ గా ఉండిపోయారు.ప్రస్తుతం చాలామంది ఎమ్యెల్యేలు బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారట.
తాజాగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ బీజేపీ ఎంపీ అర్వింద్తో కలవడంతో పాటు పార్టీ మారేందుకు సిద్ధమన్న సంకేతాలు ఇచ్చేశారు.ఇక అహ్మద్తో పాటు సంతృప్తితో ఉన్న12 మంది ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారట.