గత టీఆర్ఎస్ ప్రభుత్వం లో అన్నీ తానై వ్యవహరించి, మంత్రిగా, షాడో ముఖ్యమంత్రిగా చక్రం తిప్పిన కేసీఆర్ వారసుడు కేటీఆర్ హావ ప్రస్తుత ప్రభుత్వంలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తోంది.మొదటి నుంచి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు కు కేటీఆర్ కు మధ్య పోటా పోటీ నడిచింది.
ఆ రేసులో ఎలాగైతేనేం కేటీఆర్ పై చేయి సాధించాడు.ఇక ఇప్పుడు కొత్త ప్రభుత్వం లో కేటీఆర్ హవాకు అడ్డుకట్ట ఉండదని అంతా భావించారు.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ మంచి పొజిషన్ లో ఉన్నట్టు పైకి కనిపిస్తున్నా లోపల చోటుచేసుకుంటున్న పరిణామాలు కలవరం పుట్టిస్తున్నాయట.ముఖ్యంగా పార్టీలో నాయకుల మద్దతు కరువయ్యింది అనే ప్రచారం జరుగుతోంది.
ఇదే విషయాన్ని కేటీఆర్ తన సన్నిహితుల దగ్గర చర్చించి ఆవేదన చెందినట్టు గుసగుసలు స్టార్ట్ అయ్యాయి.
అసలు ఈ చర్చంతా రావడానికి ప్రధాన కారణం కూడా లేకపోలేదు.
కొద్ది రోజుల క్రితం ఇంటర్మీడియట్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళంతో అధికార పార్టీని విపక్షాలు గట్టిగా టార్గెట్ చేసుకున్నాయి.గ్లోబరీనా వ్యవహారంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఇతర నేతలు గట్టిగా విమర్శలు చేశారు.
అయితే, దీనిపై కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.మే డే వేడుకల్లో కేటీఆర్ మాట్లాడుతూ, తనకు గ్లోబరీనాతో సంబంధం లేదని వివరణ ఇచ్చారు.రూ.10 వేల కోట్ల స్కాం చేసినట్టు రేవంత్ ఆరోపించడంపైనా కేటీఆర్ మండిపడ్డారు.రూ.4.30 కోట్ల టెండర్కు రూ.10 వేల కోట్ల లంచమిస్తారా అని ప్రశ్నించారు.ఈ వ్యవహారంలో కేటీఆర్ కు బాసటగా పెద్దగా నేతలెవ్వరూ స్పందించకపోవడంతో కేటీఆర్ హార్ట్ అయ్యారట.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తన మీద ఇంత ఎదురుదాడి జరుగుతుంటే కనీసం పార్టీ నేతలెవ్వరూ స్పందించకపోవడంతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పుబట్టినట్టు తెలిసింది.తనపై కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణలను తానే ఖండించుకోవాలా అంటూ కొంతమంది నాయకుల వద్ద మండిపడ్డారట.ఈ వ్యవహారంతో బాగా హర్ట్ అయిన కేటీఆర్ గత మూడు రోజులుగా పార్టీ నాయకులు ఎవ్వరితోనూ పెద్దగా టచ్ లో లేనట్టు తెలుస్తోంది.
పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటేనేమి ఇప్పుడు తాను పార్టీలో ఒంటరివాడినే అన్న ఫీలింగ్ లో కేటీఆర్ ఉన్నాడట.