పరిపాలన ఎంత బ్రహ్మాండంగా ఉన్నా, రాబోయే ఎన్నికలను తలుచుకుని టీఆర్ఎస్ పార్టీ ఆందోళనలో ఉంది.రెండుసార్లు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడంతో మళ్లీ మూడోసారి గెలవడం అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు అనే విషయం టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గుర్తించారు.
అందుకే తన సహజ శైలిని మార్చుకుని మరీ కొంత కాలంగా యక్టివ్ గా ఉంటూ హడావుడి చేస్తున్నారు.తెలంగాణ నెలకొన్న అన్ని సమస్యల పైన దృష్టి సారిస్తూ ప్రభుత్వం పై వ్యతిరేకత లేకుండా చూసుకుంటున్నారు.
అదే సమయంలో తమ పార్టీలో ఉంటూ , తమ తీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులను మొహమాటం లేకుండా బయటకు సాగనంపుతున్నారు.అయినా ప్రజల్లో పూర్తి స్థాయిలో సానుకూలత లేదు అనే విషయం కేసీఆర్ ను కలవరానికి గురి చేస్తోంది.
ఈ నేపథ్యంలోనే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను వినియోగించుకుంటే ఎలా ఉంటుంది అనే అభిప్రాయం టిఆర్ఎస్ అగ్రనేతల్లో కనిపిస్తుంది.దీనిపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నా, మెజారిటీ నాయకులు మాత్రం రాజకీయ వ్యూహకర్త గా పీకే ను నియమించుకుంటేనే రాబోయే ఎన్నికల్లో తిరుగులేని అధికారం సొంతమవుతుందనే అభిప్రాయానికి వచ్చారట.
ఇదే విషయమై పికేనూ సంప్రదించినట్లు తెలుస్తోంది.కొద్ది నెలల క్రితమే తాను రాజకీయ వ్యూహకర్తగా ఏ పార్టీకి సేవలు అందించబోను అంటూ ప్రశాంత్ కిషోర్ ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
అయితే ఆయన ఆధ్వర్యంలోని ఐ ప్యాక్ టీమ్ మాత్రం యధా విధి గా పనిచేస్తుంది అంటూ ఆయన ప్రకటించారు.
ఇప్పుడు టిఆర్ఎస్ తరఫునా ఐ ప్యాక్ టీమ్ పనిచేసే అవకాశం కనిపిస్తోంది.ఇది ఇలా ఉండగా బీజేపీ వ్యతిరేక కూటమి తరపున యాక్టివ్ గా పని చేస్తున్న ప్రశాంత్ కిషోర్ అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి బిజెపిని కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాకుండా చేయాలనే ఆలోచనతో ఉన్నారు.దీనిలో భాగంగానే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తమిళనాడులో డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా వాటికి రాజకీయ వ్యూహాలు అందించారు.
ఇప్పుడు టిఆర్ఎస్ ను ఆ కూటమిలోకి తీసుకువచ్చే ఆలోచనలో ప్రశాంత్ కిషోర్ ఉన్నారు.దానిలో భాగంగానే టిఆర్ఎస్ తరఫున పని చేసేందుకు ఆయన సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలోనే దీనికి సంబంధించిన కసరత్తు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.