త్వరలోనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతున్న మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం టిఆర్ఎస్ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతూ వస్తోంది.పార్టీ పెట్టడమా లేక మరేదైనా పార్టీలో చేరతారా అనే విషయాన్ని పక్కన పెడితే, ఆయన వ్యవహారం ముందు ముందు తమకు ఇబ్బందికరంగా మారుతుంది అనే అభిప్రాయంతో టిఆర్ఎస్ పెద్దలు ఉన్నారు.
ఇప్పటికి మంత్రివర్గం నుంచి ఈటెల రాజేందర్ ను తప్పించిన కేసీఆర్ త్వరలోనే ఆయన ఎమ్మెల్యే పదవి పై అనర్హత వేటు వేసే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.అసలు మంత్రి మండలి నుంచి తొలగించడాన్ని ఈటెల రాజేందర్ జీర్ణించుకోలేక పోతున్నారు.
అందుకే తన ఎమ్మెల్యే పదవితో పాటు, పార్టీకి రాజీనామా చేస్తారని భావించినా ఆయన సైలెంట్ గానే ఉండిపోయారు.కానీ టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తూనే, మరోవైపు అన్ని పార్టీల లోని కీలక నేతలను కలుస్తూ , తన భవిష్యత్తు కార్యాచరణపై , అలాగే తెలంగాణలో ఏ విధంగా రాజకీయ ముందుకు వెళ్లాలనే విషయంపైన లోతుగా ఆయన చర్చిస్తున్నారు.
అలాగే బిజెపి, కాంగ్రెస్ పార్టీలు ఈటెల రాజేందర్ ను చేర్చుకునేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ఈటెల రాజేందర్ ఇప్పట్లో రాజీనామా చేసే అవకాశాలు కనిపించకపోవడం, అలాగే మీడియా కు ఇస్తున్న ఇంటర్వ్యూల్లోనూ, యూట్యూబ్ ఛానళ్ల లోనూ టిఆర్ఎస్ కు వ్యతిరేకం గా చేస్తున్న వ్యాఖ్యలు అన్నిటిని టిఆర్ఎస్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
వీటిని సాక్ష్యాలుగా చేసుకుని, ఈటెల పై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అలాగే ఈటెల రాజేందర్ పై అనర్హత వేటు వేసేందుకు అవసరమైన అన్ని ఆధారాలను సేకరించే పనిలో టిఆర్ఎస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది.ఇప్పటికే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెల ను టార్గెట్ చేసుకున్న టిఆర్ఎస్ హరీష్ రావు ద్వారా ఎక్కడికక్కడ చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పుడు ఈటెల పై అనర్హత వేటు వేయించే విషయంలోనూ అంతే స్పీడ్ గా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరుతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి.
.