హుజురాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు అధికార పార్టీ టిఆర్ఎస్ చేయాల్సిందంతా చేస్తోంది.ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత ఈ నియోజకవర్గంలో కనిపించకుండా చేయడంతో పాటు, బిజెపి, ఈటెల రాజేందర్ ప్రభావం ఎన్నికలపై పడకుండా వరుసగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ, ఈ నియోజకవర్గంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీ, ప్రభుత్వపరంగా తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తోంది.
ఇక్కడ గనుక టిఆర్ఎస్ ఓటమి చెందితే, ఆ ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో కేసీఆర్ కు బాగా తెలుసు.అందుకే ఆ పరిస్థితి రాకుండా ముందుగానే జాగ్రత్త పడుతున్నారు.
దీనికోసం తెలంగాణ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని పక్కనపెట్టి మరి కేసీఆర్ వరాల జల్లులు ఈనెల 16వ తేదీన ఏర్పాటు చేశారు.
ఈ సభకు భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు.
ఈ సభలో కేసీఆర్ ప్రభుత్వ పరంగా చేస్తున్న మేలు గురించి జనాలకు చెప్పడంతో పాటు, రాజేందర్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.ఈ సభ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టిఆర్ఎస్, దీనికి ఆర్థిక మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులతో ఈ సభను విజయవంతం చేసే ప్రణాళికలు రచిస్తున్నారు.
అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలను హుజురాబాద్ ఎన్నికలలో భాగస్వామ్యం చేసేందుకు వారిని ఇన్చార్జిలుగా నియమిస్తున్నారు.నియోజకవర్గంలో ప్రతి ఓటర్ ను కలిసే విధంగా, మండలాల వారిగా, గ్రామాల వారిగా ఇన్చార్జిల నియామకం చేపట్టారు.
ఈ మేరకు మంత్ర హరీష్ రావు నేతలతో సమావేశం నిర్వహించారు.ఈ నియోజకవర్గంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు తమకు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో ఉన్న కీలక నేతలను టిఆర్ఎస్ లో చేర్చుకునే కార్యక్రమం జరుగుతూనే ఉంది.బీజేపీ నుంచి మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి, కశ్యప్ రెడ్డి, ఈటెల అనుచరులు సమ్మిరెడ్డి, దేశిన స్వప్న కోటి వంటి వారిని చేర్చుకున్నారు.
ఇక నియోజకవర్గంలో కీలక నేతగా ఉన్న శ్రీనివాస్ ను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు.కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ గా అవకాశం కల్పించబోతున్నారు.
ఇక పెద్దఎత్తున సంక్షేమ పధకాలను ప్రకటిస్తూ, వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా టీఆర్ఎస్ ఇప్పటికే వ్యూహాలు రచిస్తోంది.ఈ నియోజకవర్గంలో ప్రతి ఓటర్ ను కలిసేందుకు వంద మందికి ఒకరు చొప్పున ఇంచార్జి లు గా నియమించి, ఈ నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు టిఆర్ఎస్ ప్రయత్నిస్తున్న తీరు చూస్తుంటే, ఈ ఎన్నికలను ఆ పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అనే విషయం అర్థమవుతోంది.