ఇక పూర్తిగా టిఆర్ఎస్ పార్టీకి శత్రువుగా మారిపోయిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరడం, హుజురాబాద్ నుంచి ఆయన కానీ , ఆయన సతీమణి కానీ పోటీ చేసే ఆలోచనలో ఉండడంతో అసలు ఈటెల రాజేందర్ కు ఈ నియోజకవర్గంలో ఉన్న బలం ఎంత ? ఆయన వెంట నడిచే వారు ఎంతమంది ఉన్నారు అని లెక్కలు తీసే పనిలో టిఆర్ఎస్ నిమగ్నమైంది.ఇప్పటికే పార్టీ శ్రేణులు ఎవరు ఆయన వెంట వెళ్లకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు .
టిఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తి నాయకులను గుర్తించి వారు ఎవరు ఈటెల రాజేందర్ వైపు వెళ్లకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.ఇప్పటికే మంత్రి హరీష్ రావు , గంగుల కమలాకర్ , కొప్పుల ఈశ్వర్ తోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు హుజురాబాద్ నియోజకవర్గ పరిస్థితులను, ఈటెల రాజేందర్ బలాన్ని అంచనా వేసేందుకు సమావేశం అయ్యారు.
ఈ సందర్భంగా ఈ నియోజకవర్గంలో మున్సిపాలిటీలు , మండలాల వారీగా టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి లను నియమించగా ఆ ఇన్చార్జిలు తమకు అప్పగించిన చోట్ల పార్టీ పరిస్థితిని ఈ సమావేశంలో వివరించినట్లు తెలుస్తోంది.
టిఆర్ఎస్ పార్టీకి చెందిన జడ్పిటిసి ,ఎంపిటిసి , మున్సిపల్ చైర్మన్ లు, కౌన్సిలర్లు, సర్పంచులు మార్కెట్ కమిటీ చైర్మన్ తదితరులు టిఆర్ఎస్ లోనే ఉంటామని ఈటల వైపు వెళ్ళమని ప్రకటించిన అంశంపైన ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.
ఇప్పటికే పార్టీ కి దూరమైన నియోజకవర్గంలోని నాయకులందరినీ మళ్ళీ బుజ్జగించి పార్టీలో యాక్టివ్ చేయాలని, అలాగే ఈటెల రాజేందర్ తో ప్రస్తుతం ఉంటున్న నేతలను టిఆర్ఎస్ వైపు తీసుకురావాలనే విషయంపైన చర్చించారు.
అంతేకాదు గతంలో రాజేందర్ వ్యవహార శైలి కారణంగా పార్టీకి దూరమైన వారు పార్టీలోనే ఉంటూ యాక్టివ్ గా లేaనివారు అందరిని గుర్తించి , యాక్టివ్ చేసే పనుల్లో మంత్రులు నిమగ్నమయ్యారు.అంతేకాదు హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ కు సొంత బలంతో పాటు, బిజెపికి ఇక్కడ ఉన్న పట్టు, ఓటు బ్యాంకు, వంటి వాటిపైన ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.ఇక ఉప ఎన్నికలు ముగిసేవరకు ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి పెట్టి ఈటెల రాజేందర్ కు పట్టు లేకుండా చేసే ఆలోచనలు టిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఉంది.