దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంపై కాకుండా మెజారిటీ పై ఇప్పుడు టిఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది.తమ ప్రత్యర్థులకు గట్టి షాక్ ఇచ్చేలా, ఎత్తుకు పైఎత్తులు వేస్తూ, టిఆర్ఎస్ కు భారీ ఆధిక్యత తీసుకువచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ప్రస్తుతం దుబ్బాక ఉప ఎన్నికల బాధ్యతను పూర్తిగా టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు చూస్తున్నారు.ట్రబుల్ షూటర్ గా పేరున్న హరీష్ రావు ఇప్పటికే రంగంలోకి దిగి పరిస్థితిని తమకు అనుకూలంగా ఉండే విధంగా గట్టిగానే కష్టపడుతున్నారు.
తాజాగా హరీష్ రావు టిఆర్ఎస్ కాంగ్రెస్ ను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు రాజకీయ సంచలనం కలిగిస్తున్నాయి.
దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని, ఈ రెండు పార్టీలు కలిసి టిఆర్ఎస్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేక, బీజేపీ కాంగ్రెస్ తో రహస్య ఒప్పందం చేసుకుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీపై పోరాడాల్సి ఉండగా, టిఆర్ఎస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారని హరీష్ మండిపడ్డారు.జాతీయ స్థాయిలో మాత్రం రాహుల్, ప్రియాంక గాంధీ ఇద్దరు బీజేపీపై రాజీ లేకుండా పోరాటం చేస్తున్నారని, కానీ రాష్ట్ర నాయకుల్లో మాత్రం ఎక్కడా ఆ తపన కనిపించడం లేదని విమర్శించారు.
ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం టాగూర్ పైన హరీష్ విమర్శలు చేశారు.కొద్ది రోజుల క్రితం దుబ్బాక వచ్చినప్పుడు రైతు బిల్లుల విషయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారని, కానీ రైతు బిల్లుపై బీజేపీ ని విమర్శించాలని హరీష్ రావు సూచించారు.
ఇదిలా ఉంటే హరీష్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల్లో చర్చ గా మారాయి.కాంగ్రెస్ ఇక్కడ గెలిచి తీరాలనే కసితో ఉండడంతో పాటు, కీలక నాయకులు అందరిని దుబ్బాక నియోజక వర్గంలో మోహరించి గెలుపును తమ వైపు తిప్పుకోవాలనే విధంగా వ్యవహరిస్తున్న సమయంలో బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని హరీష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తమకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయంలో ఆ పార్టీ ఉంది.ఇక బీజేపీ విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులైన బండి సంజయ్ కు ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.
ఆయన ఈ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎన్నికలు కావడంతో, ఇది తన పనితీరుకు నిదర్శనంగా ఆయన భావిస్తున్నారు.
అధికార పార్టీ టిఆర్ఎస్ ను ఎదుర్కొనేందుకు గట్టిగా కష్టపడుతున్న సమయంలో హరీష్ రావు బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయనే విషయాన్ని హైలెట్ చేస్తూ, పదే పదే ప్రచారం చేస్తూ ఉండడం వంటి వ్యవహారాలు ఆ పార్టీలో ఆందోళన పెంచుతున్నాయి.