తెలంగాణాలో అధికార పార్టీ హవాకు అడ్డుకట్టే లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది.అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని సత్తా చాటిన టీఆర్ఎస్ అదే దూకుడు కొనసాగిస్తూ తెలంగాణాలో విపక్షం అనేది లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది.
దీనిలో భాగంగా ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్యెల్యేలను కారెక్కిస్తూ ప్రతిపక్షాలను కలవరానికి గురిచేస్తున్నారు.ఇంతవరకు కారు జోరుకు అడ్డుకట్టే లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంటూ వచ్చింది.
ఆ జోరు అలా ఉండగానే తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు తెరతీసింది.ఇప్పుడు లోక్ సభ ఫలితాలు రాకుండానే స్దానిక సంస్థల ఎన్నికలపై గురిపెట్టింది.
ఇలా వరుస ఎన్నికలతో తెలంగాణలో వరుస వరుసగా ఓట్ల పండుగ జరుగుతూనే ఉంది.
అయితే శాసనసభకు, లోక్ సభ ఎన్నికలకు మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కారు పార్టీ కి కుదుపులు తప్పలేదు.
అధికారికంగా అభ్యర్దులను ప్రకటించకపోయినా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమి పాలైన వారంతా టీఆర్ఎస్ పార్టీ నాయకులే.తాజాగా జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీ టీఆర్ఎస్ కు దెబ్బతగులుతుందా అనే చర్చ ఇప్పుడు మొదలయ్యింది.
ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ మాయ చేసిందని అందుకే ఆ పార్టీ అధికారాల్లోకి వచ్చిందని ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి.
కాకపోతే ఇప్పుడు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పత్రాల ద్వారనే జరుగుతుండడం కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్తేజాన్ని కలిగిస్తోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో అంత సానుకూల దృక్పధం లేదని, ప్రజలు టీఆర్ఎస్ పరిపాలనపై విసుగుచెందారని కాంగ్రెస్ వాదిస్తోంది.ఇప్పుడు బ్యాలెట్ పత్రాల ద్వారా అది రుజువవుతుందని ప్రతిపక్ష పార్టీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేకత తమకు మేలు చేసి మళ్ళీ తమ పార్టీ పుంజుకుంటుందని కాంగ్రెస్ నమ్ముతోంది.వాస్తవంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే టీఆర్ఎస్ కి అంతగా అనుకూల పవనాలు లేనట్టుగానే పరిస్థితులు కనిపిస్తున్నాయి.