తాను అనుకున్నది ఏదైనా జరగాల్సిందే జరిగి తీరాల్సిందే రాజీ మాత్రం పడేది లేదు అన్నట్టుగా తెలంగాణ సీఎం కేసీఆర్ భావిస్తుంటాడు.పూర్తిగా ఎన్నికల మూడ్ లో ఉన్న ఆయన ముందస్తు ఎన్నికలపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు.
అందుకు తగ్గట్టుగానే పార్టీ నాయకులను కూడా తెగ కంగారు పెట్టేస్తున్నాడు.ప్రగతి నివేదన సభ పేరుతో సెప్టెంబర్ 2 న 25 లక్షలమంది తో భారీ స్థాయిలో సభ నిర్వహించి తన సత్తా ఏంటో నిరూపించుకోవాలని కేసీఆర్ తహతహలాడుతున్నాడు.
కానీ ఆ పార్టీ నాయకులకు మాత్రం ఇది పెద్ద సవాల్ గా మారింది.
ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇది పెద్ద అగ్ని పరీక్షగా మారింది.జనసమీకరణ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.ఒకరిని మించి మరొకరు సమీకరణలో పైచేయి సాధించాలని తపన పడుతున్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిలో పడేందుకు తంటాలు పడుతున్నారు.ఈ నెల 2న కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభ జరపాలని కేసీఆర్ నిర్ణయించారు.
కేసీఆర్ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో సిట్టింగ్ ఎమ్యెల్యేల్లో టెన్షన్ పెరిగిపోయింది.
ప్రగతి నివేదన సభలోనే ఒక జాబితాను కేసీఆర్ విడుదల చేసే అవకాశం ఉందని.
ఈ కారణంతో నియోజకవర్గాల్లో సీటు కోసం పోటీ పడే అభ్యర్థులు జనసమీకరణలో తలమునకలై ఉన్నారు.అయితే అంతమందిని సమీకరించడం సాధ్యమయ్యే పనేనా అనే ఆందోళన వారిలో కనిపిస్తోంది.
ఒక్కొక్క నియోజకవర్గం నుంచి ఇరవై వేల నుంచి ఇరవే అయిదువేల మంది తరలించాలన్న టార్గెట్ పెట్టుకున్నారు.
ఇప్పటికే కొందరు నేతలు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రయివేటు కళాశాలల బస్సులను కూడా ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకుంటున్నారు.జనాలను తరలించడానికి కనిపించిన వాహనాన్ని కనిపించినట్టే బుక్ చేసేస్తున్నారు.అవి కూడా సరిపోవని ఆలోచనతో కర్ణాటక నుంచి కూడా కొన్ని ట్రావెల్స్ వాహనాలను రప్పిస్తున్నారు.
ఎంత జనసమీకరణ చేస్తే అంత క్రెడిట్ తమకు దక్కుతుందని, అందుకే ఎంత కష్టమైనా నష్టమైనా జనాలను సభకు రప్పిస్తామని సిట్టింగ్ ఎమ్యెల్యేలు చెప్తున్నారు.