ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చింది అన్నట్టుగా త్వరలోనే తెలంగాణ మంత్రి , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ ముఖ్యమంత్రి గా ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ ఉండగా, అనేక చిక్కులు వచ్చిపడుతున్నాయి.అసలు ఎప్పుడో కేటిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరిగినా, అందుకు తగ్గ పరిస్థితులు ఏర్పడకపోవడం, వరుసగా వచ్చిన ఎన్నికలు, ఇలా అనేక కారణాలతో అది కాస్త వాయిదా పడుతూ వచ్చింది.
కేటీఆర్ కు ఇప్పుడు ప్రమోషన్ కల్పించి, కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలలో యాక్టివ్ కావాలని భావించారు.కానీ జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు చేసేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడటంతో, సైలెంట్ అయిపోయారు.
కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం, ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చేదు ఫలితాలు, రాబోయే ఎన్నికల్లో బిజెపి గెలుపు అవకాశాలు తక్కువగా ఉండడం అలాగే, కాంగ్రెస్ ప్రభావం అంతంత మాత్రమే ఉండేలా కనిపిస్తూ ఉండడం, ఇలా ఎన్నో కారణాలతో ప్రాంతీయపార్టీల కూటమికి ఇదే సరైన సమయం అని, ఇప్పుడు కార్యకలాపాలు ప్రారంభిస్తే కేంద్రంలో అధికారం సంపాదించడం కష్టమేమి కాదనే అభిప్రాయంతో కెసిఆర్ ఉండటంతోనే, ఇప్పుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా ప్రభావం తగ్గిన తర్వాత సీఎం పీఠంపై కేటీఆర్ ను కూర్చోబెట్టి తన బాధ్యత నెరవేర్చు కోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.అందుకే పార్టీలోనూ, ప్రభుత్వంలో ఉన్న కేటీఆర్ వ్యతిరేకులపై కెసిఆర్ దృష్టి సారించడంతో, ఒక్కొక్కరుగా ఏరివేత మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు.ఈటెల రాజేందర్ ఒకరే కాకుండా , మంత్రివర్గంలో ఉన్న మరికొంత మంది కేటీఆర్ విషయంలో అసంతృప్తిగా ఉండడంతో ,వారందరిని గుర్తించి రాబోయే రోజుల్లో కేటీఆర్ కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా , ఇప్పటి నుంచే కెసిఆర్ జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది.
కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేసే సమయంలోనే మంత్రివర్గ ప్రక్షాళన చేపట్టి, పూర్తిగా కేటీఆర్ అనుకూల వర్గీయులతో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కేసిఆర్ ఉండడంతో ఇప్పుడు ఈ విధంగా వ్యవహరించబోతున్నట్టు తెలుస్తోంది.ఇక వరుస ఎరివేతల కార్యక్రమం ఉండడం తో టీఆర్ఎస్ నేతల్లో ఆందోళనలు పెరిగిపోతున్నాయి.
ఏ రూపంలో ఎవరిపై వేటు అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.