టిఆర్ఎస్ మంత్రి ఈటెల రాజేందర్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో గుబులు పుట్టిస్తోంది. సొంత పార్టీ నాయకుడు , టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ పై అవినీతి వ్యవహారాలను ఇప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం విచారణ చేస్తోంది.
దీనిపై తెలంగాణలో పెద్ద చర్చే నడుస్తోంది.వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఈటెల రాజేందర్ ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి తెలంగాణలో తీవ్రమవుతున్న సమయంలోనే, ఇప్పుడు అదే శాఖ మంత్రి పై అవినీతి వ్యవహారాలు రావడం, దానిపై ప్రభుత్వం విచారణ చేయించడం తో త్వరలోనే ఆయనపై వేటు వేసే అవకాశం కనిపిస్తోందనే హడావుడి మొదలయ్యింది.
మెదక్ జిల్లాలోని ముసాయి పేట మండలంలోని అచ్చంపేట, హకీంపేట గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు కెసిఆర్ కు ఫిర్యాదు చేశారని, ఆ వ్యవహారం బయటపడడంతోనే ఈటెల పై ఇప్పుడు విచారణకు టిఆర్ఎస్ ప్రభుత్వం దిగింది అనే ప్రచారం జరుగుతోంది.
అయితే ముందుగా ఈ విషయమై కెసిఆర్ ఈటెల తో సంప్రదించలేదని, ఆయన ఏమి చెప్పకుండానే దీనిపై విచారణకు ఆదేశించడం వెనుక రాజకీయం ఎంటి అనే దాని పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కేసీఆర్ నిర్ణయం పై ఈటెల రాజేందర్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాకుండా ఆయన అభిమానులు, పార్టీకి చెందిన కొంతమంది నాయకులు కరీంనగర్ హైవే పై బైఠాయించారు.
టిఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఈటెల రాజేందర్ వ్యవహారంలో గుర్రుగా ఉందని, ఆయనను పదవి నుంచి తప్పించేందుకు రకరకాల కారణాలు వెతుకుతూ ఉందని, ఇప్పుడు ఈ అవినీతి వ్యవహారాన్ని హైలెట్ చేసి ఆయనను పదవి నుంచి తప్పించాలని చూస్తున్నారని ప్రచారం ఊపందుకుంది.ఇదిలా ఉంటే , ఈ వ్యవహారంలో రాజేందర్ కు మద్దతుగా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతున్నాయి.
అలాగే సోషల్ మీడియాలోనూ రాజేందర్ మద్దతు ఇచ్చే వారి సంఖ్య పెరిగగా, కొంతమంది రాజకీయ నేతల్లో ఈ వ్యవహారం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.కీలక నాయకుడు కే ఈ పరిస్థితి ఏర్పడితే, తమ పరిస్థితి ఏంటని టెన్షన్ వారిలో కనిపిస్తోంది.
గత కొంతకాలంగా టిఆర్ఎస్ అధినేత కెసిఆర్, కేటీఆర్ వంటి వారు మంత్రులు, ఎమ్మెల్యేల కార్యకలాపాలపై నిఘా పెట్టారనే, ప్రచారం సాగుతుండటంతో, ఎవరిపైన అయినా ఏ క్షణంలోనైనా ఈ తరహ విచారణలు జరిగే అవకాశం ఉందని , అధినేతల నిర్ణయాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇదే పరిస్థితి ఏర్పడుతుందనే కంగారు రాజకీయ వర్గాల్లో కనిపిస్తోంది.