వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించి తన రాజకీయ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల పాదయాత్ర తెలంగాణ అంతట చేపడుతున్నారు.తన పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున ఉండేలా చేసుకోవడంతో పాటు, ప్రజల్లో పార్టీకి ప్రత్యేక గుర్తింపు వచ్చే విధంగా షర్మిల ప్లాన్ చేసుకుంటున్నారు అయితే ఆశించిన స్థాయిలో అయితే ఆ ప్రభావం కనిపించడం లేదు.
పార్టీ ఆవిర్భావం నుంచి షర్మిల టిఆర్ఎస్ ను ప్రధానంగా టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తున్నారు.షర్మిల విమర్శలను తెలంగాణలోని మిగతా రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోనట్టుగా వ్యవహరించడం తదితర కారణాలతో ఆమె మరింత స్పీడ్ పెంచారు.
ప్రస్తుతం పాదయాత్రలో చురుగ్గా పాల్గొంటున్న ఆమె ఏ నియోజకవర్గానికి వెళ్తే ఆ నియోజకవర్గ స్థానిక సమస్యలను ప్రస్తావించడంతో పాటు, స్థానిక ఎమ్మెల్యే పైన విమర్శలు చేస్తూ వార్తల్లో వ్యక్తిగా మారుతున్నారు .సంగారెడ్డి జిల్లాలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆందోల్ నియోజకవర్గం జోగిపేటలో ప్రసంగించిన షర్మిల ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.దీంతో షర్మిల వ్యాఖ్యలను తప్పుపడుతూ టిఆర్ఎస్ తో పాటు, దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ లో షర్మిలపై ఫిర్యాదు చేశారు .
గౌరవ హోదాలో ఉన్న దళిత జాతి బిడ్డను పేరు పెట్టి అవమానకరంగా మాట్లాడినందుకు షర్మిలపై ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదులు పేర్కొన్నారు.ఇక విషయానికి వస్థే జోగిపేట బస్టాండ్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన షర్మిల ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ కాదు కంత్రి కిరణ్ అంటూ సెటైర్లు వేశారు. ఎక్కడ చూసినా కబ్జాలేనని , ఎక్కడ ప్రభుత్వ స్థలం కనిపిస్తే అక్కడ జండా పాతడమే ఆయన వృత్తి అంటూ షర్మిల విమర్శించారు.
ఒక దళితుడు అయి ఉండి చెరువులు అసైన్డ్ భూములు అన్ని కబ్జాలు చేస్తున్నారని స్వయంగా ఆయన తండ్రి చెప్పారంటూ షర్మిల వ్యాఖ్యానించారు.దళిత బిడ్డ అయి ఉండి ఏనాడైనా దళితుల కోసం వారి హక్కుల కోసం పోరాడారా అంటూ షర్మిల ప్రశ్నించారు .అలాగే ఒక జర్నలిస్ట్ అయి ఉండి ఏనాడైనా జర్నలిస్టుల కోసం కొట్లాడారా అంటూ షర్మిల ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.ఈ వ్యవహారం పై వివాదం నెలకొనడంతో షర్మిల పై అట్రాసిటీ కేసు నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.