తెలంగాణలో వరుసగా వస్తున్న ఎన్నికలు టిఆర్ఎస్ కు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.గెలిస్తే ఫర్వాలేదు కానీ, ఓటమి చెందితే మాత్రం అధికార పార్టీ గా ఉన్న తమ పరువు పోతుందనే భయం టిఆర్ఎస్ నేతలను వెంటాడుతోంది.
ఇప్పటికే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఇబ్బందుల్లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కి నాగార్జునసాగర్ ఉప ఎన్నికలు టెన్షన్ పుట్టిస్తున్నాయి.గతంలో మాదిరిగా ఇప్పుడు టీఆర్ఎస్ కు తిరుగులేని ప్రజల మద్దతు లేకపోవడం, ప్రజావ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుండడం , ఎమ్మెల్యేలు ,ప్రజాప్రతినిధులపై జనాల్లో వ్యతిరేకత పెరుగుతుండడం, ఇవన్నీ ప్రభుత్వంపై ప్రభావం చూపిస్తున్నాయని, టిఆర్ఎస్ పార్టీ నమ్ముతోంది.
అంతేకాకుండా నిఘా విభాగాల ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది అనే విషయం రుజువు కావడంతో గులాబీ పార్టీ కాస్త కంగారు లోనే ఉంది.ఏప్రిల్ 17వ తేదీన సాగర్ ఉప ఎన్నికల పోలింగ్ ఉండడం తో, అప్పటిలోగా ప్రజల మద్దతు పూర్తిగా ఉండేలా టీఆర్ఎస్ ప్లాన్ చేసుకుంటోంది.
ఇప్పటికే ఇక్కడ దివంగత నోముల నరసింహయ్య కుమారుడు భగత్ ను అభ్యర్ధిగా ఎంపిక చేశారు.బిజెపి , కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి.అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు పైచేయి సాధించకుండా , టిఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని, పార్టీ వర్గాలు భావిస్తున్నాయి .అయితే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాక ముందే ఈ నియోజకవర్గంలో కేసీఆర్ పర్యటించి ,అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేశారు.
అలాగే హాలియా బహిరంగ సభలో ప్రసంగిస్తూ నాగార్జునసాగర్ నియోజకవర్గానికి టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమేమి చేసింది అనేది స్పష్టంగా చెప్పారు.దీంతో ఎన్నికల ప్రచారానికి కెసిఆర్ రారు అని , టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీష్ రావు వంటివారు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని మరో ప్రచారం జరుగుతోంది.అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు టిఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం కావడం , ఈ ఫలితాల ప్రభావం ఎన్నికలపై ఉండే అవకాశం ఉండడంతో ఎన్నికల ప్రచారం ముగింపు రోజున ఈ నియోజకవర్గంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ నిర్వహించే ఆలోచన ఉన్నారని, అది సాధ్యం కాకపోతే రోడ్ షో అయినా నిర్వహిస్తారని పార్టీలోని విస్వాన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.