టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సర్వే ఫీవర్ పట్టుకుంది.తమపై ఎలాంటి రిపోర్టు అందిందోనని ఆందోళన చెందుతున్నారు.
గులాబీ బాస్ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిషోర్ తో సర్వేలు చేయిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ నివేదికలో చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చినట్లు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలపై భూ కబ్జాలు, అక్రమ సంపాదన అధికార దుర్వినియోగం అవినీతి ఆరోపణలకు తోడు ఇందులో చాలామంది గెలుపు కూడా కష్టమేనని తేల్చారు.దీంతో ఎమ్మెల్యేలు సర్వేలంటేనే భయపడుతున్నారు.
అయితే కేసీఆర్ ఈ సర్వే నివేదికలపై ఒకే సారి చెప్పకుండా అప్పుడప్పుడు లీకులు ఇస్తున్నారట.
దీంతో ఆయా జిల్లాల్లో నాయకులు కంగారు పడుతున్నారు కేసీఆర్ చేతిలో ఉన్న సర్వే ఫలితాలకు తోడు ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతతో పలువురు ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు కష్టమేనని తెలుస్తోంది.
మరోవైపు ద్వితీయ శ్రేణి లీడర్లు అవకాశం కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారట.సొంత పార్టీలోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నాలు చేస్తున్నారట.
సామాజికవర్గం బంధువులు పార్టీ శ్రేణులు స్నేహితులు వ్యాపార భాగస్వాములు ఇలా ఎవరు ఏ చిన్న కార్యక్రమానికి పిలిచినా.వెంటనే వాలిపోతున్నారట.
ఆ నియోజక వర్గాల్లో.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో ఇప్పటికే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయిందంటున్నారు.ఎమ్మెల్యే కాలె యాదయ్య, మాజీ ఎమ్మెల్యే రత్నంల మధ్య వర్గపోరు తార స్థాయికి చేరింది.భూ కబ్జాలు, అక్రమ ఆస్తులు, అధికార దుర్వినియోగం అవినీతిపై వీరిరువురూ బహిరంగ ఆరోపణలు చేసుకుంటున్నారట.
ఈ కారణంగా ప్రజల్లో పార్టీపై నమ్మకం సన్నగిల్లిందంటున్నారు.ఇక కల్వకుర్తిలోనూ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కూడా రెండు వర్గాలుగా విడిపోయారు.
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి పార్టీ కార్యక్రమాలకు కొంత దూరంగా ఉంటున్నారు.ఎల్బీనగర్లోనూ ఇదే తంతు కనిపిస్తోంది.
అధికార పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన రామ్మోహన్ గౌడ్ మధ్య అంతర్గత ఆధిపత్య పోరు కొనసాగుతోందట.
అలాగే రాజేంద్రనగర్ లో సిట్టింగ్ స్థానంపై మంత్రి కుమారుడితో పాటు ఎంపీ కూడా ఫోకస్ పెట్టారట.
ఇప్పటికే ఆ నియోజకవర్గంలో ఎవరికి వారు పార్టీ శ్రేణులను తమవైపు తిప్పుకొనేందుకు జోరుగా ప్రయత్నాలు చేస్తున్నారట.వీరు స్థానికంగా ఉన్న సామాజికవర్గం బంధువులు ముఖ్య నేతలను తరచూ కలుస్తుండటంతో కేడర్లో కొంత గందరగోళం నెలకొంది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఇరువురూ విఫలమవుతున్నారు.ఏదేమైనా సర్వే నివేదికలు అధికార పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.